ఆశతో వస్తే చుక్కలు: ఆగిన మెట్రో సేవలు, న్యూఇయర్.. హైదరాబాద్ మెట్రో శుభవార్త
హైదరాబాద్: సాంకేతిక సమస్య కారణంగా ఆదివారం హైదరాబాద్ మెట్రో సేవలు గంటల పాటు నిలిచిపోయాయి. టెక్నికల్ సమస్య కారణంగా ఓ మెట్రో రైలు అమీర్ పేట్ స్టేషన్ వద్ద నిలిచిపోయింది.
దీంతో అమీర్ పేట - నాగోల్ మధ్య సుమారు రెండు గంటల పాటు మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన మెట్రో అధికారులు అమీర్ పేట నిలిచిన రైలును ప్రకాశ్ నగర్లోని అదనపు ట్రాక్కు తీసుకు వెళ్లారు.
రెండు గంటల విరామం తర్వాత
సాంకేతిక సమస్యతో నిలిచిన మెట్రో రైలును ప్రకాశ్ నగర్ పాకెట్ పార్కింగులో నిలపడంతో అడ్డంకి తొలగిపోయింది. దీంతో రెండు గంటల విరామం అనంతరం మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
చేదు అనుభవం
మెట్రో రైలు ఎక్కేందుకు ఆదివారం ఉదయాన్ని చాలామంది వివిధ స్టేషన్లకు చేరుకున్నారు. కానీ నిలిచిపోయిన రైలు కారణంగా గంటల పాటు సేవలు ఆగిపోవడంతో ఉత్సాహంతో వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు. మెట్రో ఎక్కేందుకు ఇప్పటికీ చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ఉత్సాహంతో వస్తే వారికి చేదు అనుభవం ఎదురైంది.
సంబరాల కోసం ఏర్పాట్లు
ఇదిలా ఉండగా, మెట్రో రైలు హైదరాబాద్ యువతకు తీపి కబురు అందించింది. ఆంగ్ల కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలా? వద్దా? అనే చర్చలు జరుగుతుండగానే కొంతమంది మాత్రం వారి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. కొత్త ఏడాది కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆదివారం కలిసి రావడంతో ఇప్పటి నుంచే సంబరాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇంగ్లీష్ న్యూ ఇయర్ కోసం రైళ్ల సేవలు పొడిగింపు
అర్ధరాత్రి వరకు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని ఇంటికెళ్లే వారు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో తన సేవలను పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి దాటాక రెండు గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. సాధారణ సమయాల్లో ఉదయం ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే నడిచే రైళ్ల సమయాన్ని ఆదివారం పొడిగించినట్టు తెలిపారు.