కొత్త సొబగులతో మెరిసిపోనున్న హైదరాబాద్ మెట్రో రైలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మెట్రోరైల్ స్టేషన్లు సరికొత్త అందాలు తీసుకురానున్నాయి. సింగపూర్ వంటి దేశాల్లో మాదిరిగా ప్రయాణికులకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
Recommended Video
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మెట్రోరైల్ స్టేషన్లు సరికొత్త అందాలు తీసుకురానున్నాయి. సింగపూర్ వంటి దేశాల్లో మాదిరిగా ప్రయాణికులకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సమగ్ర ప్రణాళిక రూపొందించింది.
నవంబర్ 28వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 30 కిలోమీటర్ల మియాపూర్ - నాగోల్ మార్గంలో రైలును ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. అప్పటికల్లా ఈ కారిడార్లోని 24 స్టేషన్ల వద్ద 600 మీటర్ల మేర పూర్తిస్థాయిలో అత్యాధునిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. మియాపూర్ వంటి పెద్దస్టేషన్ల వద్ద అభిరుచి ఉన్నవారు చిత్రకళలో నైపుణ్యం పొందేందుకు కొంతభాగం కేటాయిస్తారు. కొన్ని స్టేషన్ల నుంచి ఆకాశమార్గంలోనే బస్టాపులకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతోపాటు రైల్వే స్టేషన్లకు కొత్త సొబగులు కల్పిస్తున్నారు.
ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి రూ.60 కోట్లు, ఇంటర్ ఛేంజ్ స్టేషన్లకు రూ.250 కోట్ల చొప్పున ఖర్చవుతోంది. ఆయా ప్రాంగణాల్లో ఇప్పటికే అన్ని వసతులు కల్పించారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ బయటి పరిసరాల్లో అందాలు అద్దనున్నారు. రైలు దిగిన ప్రయాణికుడు నేరుగా ప్రధాన రహదారిపైకి రావడానికి వీల్లేదు. స్టేషన్ నుంచి ప్రత్యేకంగా నిర్మించిన వాకింగ్ మార్గంలో సర్వీసు రోడ్డులోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఒకవైపు ఆటోలు, మరోవైపు కార్లు ఆగే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు.
వాతావరణం ఇలా..
స్టేషన్ల కింద ప్రయాణికులు సేద తీరడానికి వీలుగా ఆహ్లాదకర వాతావరణం కల్పించి... కుర్చీలు, బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. స్థలం లభ్యతను బట్టి కొన్ని స్టేషన్ల మధ్య రెండు వైపులా ఏడు మీటర్ల వెడల్పున సర్వీసు రోడ్లు, గ్రీన్బెల్ట్లను అభివృద్ధి చేస్తారు. వీటికి సమీపంలోనే సైకిల్ స్టేషన్లు, బస్సు, ఆటో, ఎలక్టికల్ వాహనాలకు ప్రత్యేక మార్గాలు ఉంటాయి.
సోలార్ విద్యుత్ ప్లేట్లు ఇలా
కొన్ని మెట్రో స్టేషన్ల మధ్య ప్రయాణికులు వాకింగ్ చేసేందుకు ఆకాశ మార్గాలు కల్పిస్తారు. మైత్రీవనం దగ్గర 100, అమీర్పేట వద్ద 150 మీటర్ల పొడవున ఇవి ఏర్పాటు కానున్నాయి. మియాపూర్ - హైదర్నగర్ మధ్య రెండు కిలోమీటర్ల రోడ్డు సెలవు రోజుల్లో ఆటపాటలకు వేదిక కానున్నది. ‘రాహ్గిరి' కింద ఆయా రోజుల్లో చిత్రకళ, నృత్యం, ఆటలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. మెట్రోస్టేషన్ల దగ్గర ఏర్పాటుచేసే కొత్త బస్సు స్టేషన్ల పైకప్పులకు సోలార్ విద్యుత్ ప్లేట్లు అమరుస్తారు.
కాలుష్య నివారణకు ఇలా
మెట్రో రైళ్లు ప్రయాణించే ప్రధాన రహదారుల రూపురేఖల్ని మార్చేస్తామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడినా వాటి కిందనుండే ప్రధాన రోడ్లపై ఏమాత్రం రద్దీ లేకుండా చూస్తామని చెప్పారు. ప్రత్యేక ‘బస్-బే'లు, ఆటోలు, కార్ల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్థలాలు లేనిచోట ఆక్రణలను తొలగించి, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు పరిధిలో వసతుల కల్పనకు రూపొందించిన ప్రణాళికలన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఆయా ప్రణాళికల అమలుపై దృష్టి సారించామని చెప్పారు. మెట్రో రాకతో నగర కాలుష్యం తగ్గుముఖం పట్టే వీలున్నదని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
పీపీపీ పద్దతిలో పార్కింగ్
హైదరాబాద్ మెట్రో రైలు మార్గంలో మొత్తం 64 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 34 స్టేషన్ల వద్ద బహుళ అంతస్తుల పార్కింగ్ సౌకర్యం కల్పిస్తారు. వీటిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో 17 చోట్ల ఎల్అండ్టీ మెట్రో రైలు సంస్థ, మిగిలిన వాటిని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నిర్మిస్తాయి. పార్కింగ్ కాంప్లెక్సుల పైభాగంలో షాపింగ్ మాల్స్ ఉంటాయి.