హైదరాబాద్ మెట్రో పేరు గొప్ప ఊరు దిబ్బ ! చిన్న గాలివాన కూడా తట్టుకోవట్లేదు !
హైదరాబాద్ : ఒకప్పుడు వర్షం పడిందంటే చాలు ట్రాఫిక్ జాంఝాటంలో చిక్కుకుని నగరవాసి అల్లాడిపోయేవాడు. మెట్రో రాకతో ఆ కష్టాల నుంచి గట్టెక్కవచ్చని చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి మెట్రో రాకతో భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు కొంత వరకు తగ్గినా వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలు మెట్రో ప్రయాణీకులకు చుక్కలు చూపెడుతున్నాయి. గాలివానకు ఫ్లెక్సీలు విరిగిపడటం, టెక్నికల్ ప్రాబ్లెమ్స్ కారణంగా తరుచూ సర్వీసులు నిలిచిపోతుండటంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మెట్రోకు బాగా మరిగిన జనం..! ఫుల్ జోష్ తో దూసుకెళ్తున్న మెట్రో..!!
మెట్రోకు ఫ్లెక్సీ కష్టాలు
మెట్రో సర్వీసులకు ఫ్లెక్సీలు గండంగా మారాయి. నగరంలో గాలి వాన మొదలైందంటే చాలు ఫ్లెక్సీలు ఎగిరివచ్చి మెట్రో విద్యుత్ లైన్లపై పడటం రైలు రాకపోకలకు బ్రేకులు పడటం సర్వసాధారణం అయిపోయింది. శనివారం మధ్యాహ్నం భారీ ఈదురుగాలులు, వర్షం కారణంగా ఓ ఫ్లెక్సీ మియాపూర్ స్టేషన్ సమీపంలో విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఆ మార్గంలో నడిచే రైలు సర్వీసులపై ఆ ప్రభావం పడింది. పై ఆ ప్రభావం పడింది. మధ్యాహ్నం 3.55గం. నుంచి 4.30గం. వరకు 25 నిమిషాల పాటు ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. స్టేషన్లలో ప్రయాణీకులు రైలు కోసం ఎదురుచూస్తూ నానా ఇబ్బందులు పడ్డారు.
తరచూ సాంకేతిక సమస్యలు
శనివారం ఉదయం సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో మెట్రో సర్వీసులు ఆగిపోయాయి. శుక్రవారం రాత్రి పెద్దమ్మ గుడి - జూబ్లీ హిల్స్ మధ్య హై ఓల్టేజ్ సమస్య తలెత్తడంతో మెట్రో ట్రైన్ నిలిపివేశారు. గతంలో సిగ్నలింగ్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బేగంపేటలో మెట్రో నిలిచిపోగా.. జూబ్లీహిల్స్లోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తింది. ఇక పొల్యూషన్ కారణంగా మెట్రోలోని సున్నత పరికరాలు దెబ్బతినడంతో సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది.
పట్టించుకోని అధికారులు
మెట్రో సర్వీసుల్లో తరుచూ సమస్యలు తలెత్తుతున్నా అధికారులు మాత్రం సరిగా పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని మరోసారి అలాంటి సమస్య తలెత్తకుండా చూడటంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రయాణికులు అంటున్నారు. ఆ కారణంగా తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.