సాంకేతిక లోపం! ఆ మార్గంలో నిలిచిన మెట్రో రైళ్లు: ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్: సాంకేతిక కారణాల వల్ల మెట్రో రైలు కారిడార్-1లో ఎల్బీనగర్ నుంచి మూసాపేట వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే, మియాపూర్ వరకూ రైళ్లు నడవాల్సి ఉండగా.. మూసాపేట - బాలానగర్ స్టేషన్ మధ్యలో మెట్రో ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఆ మార్గంలో అంతరాయం ఏర్పడింది.
తాత్కాలికంగా మూసివేత
మూసాపేటలో స్లిప్ట్ రివర్సల్ విధానంలో మెట్రో ట్రాక్ మార్చి అక్కడి నుంచి ఎల్బీనగర్ వరకూ మెట్రో రైళ్లను నడుపుతున్నారు. మియాపూర్, బాలానగర్, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, కూకట్పల్లి.. ఈ ఐదు స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
తెగిపోయిన విద్యుత్ తీగలు
విద్యుత్ తీగలు తెగిపడటంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టినట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ప్రయాణికులు మెట్రోస్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు.
ప్రయాణికుల ఆందోళన
పండగ సీజన్ కావడంతో మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బాలానగర్ స్టేషన్లో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గమ్యస్థానాలు, కార్యాలయాలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని సిబ్బందితో కొందరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
సమస్యలు సాధారణమే..
కాగా, ప్రస్తుతానికి మెట్రో విద్యుత్ తీగలను పునరుద్ధరించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైళ్లను ఒకే మార్గంలో కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణమని ఆయన తెలిపారు.
కాగా, శనివారం మధ్నాహ్నం తర్వాత సాంకేతిక లోపాన్ని సరి చేయడంతో తిరిగి మెట్రో రైళ్లు ముందుకు కదిలాయి.