ఆమె 'బ్లాక్' చేసిందని: ఫేస్బుక్లో నగ్న ఫోటోలతో వేధింపులు, ఎట్టకేలకు ఇలా దొరికాడు!
హైదరాబాద్: ఫేస్బుక్ మోసాలు పెరిగిపోతున్నాయి. కేవలం అమ్మాయిలను బుట్టలో వేసుకోవడానికే ఫేస్బుక్ ఖాతాలు తెరుస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. తాజాగా అమ్మాయి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసి, మహిళలకు నగ్నచిత్రాలు, అసభ్యకర సందేశాలు పంపిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
Recommended Video
ఓ రాజకీయ పార్టీకి చెందిన మహిళను కూడా నిందితుడు నగ్న చిత్రాలు, అసభ్య సందేశాలతో వేధించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితుడిని హైదరాబాద్ ఆదర్శ్నగర్కు చెందిన దుర్గాప్రసాద్(23)గా గుర్తించి అరెస్టు చేశారు. అతని సెల్ఫోన్, ఇంటర్నెట్ రౌటర్ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
దుర్గాప్రసాద్.. బీఫార్మసీ:
నిందితుడు దుర్గాప్రసాద్ కడపకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బీఫార్మసీ పూర్తి చేసిన అతను.. ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అతని ప్రేమను నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు. హారికరెడ్డి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఫేస్ బుక్ ఖాతా నుంచి ఆమె ఫోటోలు డౌన్ లోడ్ చేసుకుని అసభ్య సందేశాలు పంపించేవాడు.
ఆమె బ్లాక్ చేయడంతో:
దుర్గా ప్రసాద్ వేధింపులకు ఆ అమ్మాయి ఫేస్ బుక్ లో అతన్ని బ్లాక్ చేసింది. దీంతో అప్పటినుంచి మహిళలు, అమ్మాయిలకు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం మొదలెట్టాడు. హారికరెడ్డి పేరు మీద ఖాతా ఉండటంతో చాలామంది మహిళలు రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసేవారు. ఆ తర్వాత ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన నగ్నచిత్రాలు, సెల్ఫీ వీడియోలను పంపుతూ అమ్మాయి అనేలా నమ్మించేవాడు. గత జులైలో మియాపూర్ కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఇతగాని బాగోతం తొలిసారిగా వెలుగుచూసింది. అప్పట్లో జైలుకు వచ్చినా.. తిరిగి అదే తీరు కొనసాగించాడు.
తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే:
తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకే దుర్గాప్రసాద్ ఎక్కువగా ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించేవాడు. అలా అతని ఖాతాలో దాదాపు 958 మంది అమ్మాయిలున్నారు. ఇదే క్రమంలో ఫెమినిస్టు, రాజకీయ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తకు హారికరెడ్డి ఐడీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు.రిక్వెస్ట్ ఓకే చేసిన ఆమెకు కొన్ని రోజుల తర్వాత అసభ్యకర ఫొటోలు, అసభ్య సందేశాలు పంపించాడు.
ఫెమినిస్టు ఫిర్యాదుతో:
అసభ్య ఫోటోలు, సందేశాలు ఎందుకు పంపిస్తున్నావని సదరు ఫెమినిస్టు అతన్ని నిలదీయడంతో.. మెసేంజర్ కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. గొంతు అబ్బాయిది కావడంతో ఆమెకు అనుమానం వచ్చింది. మీ వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆమెను బెదిరించాడు.
దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ఫేస్బుక్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆదివారం దుర్గాప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న అతని నుంచి మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.