మీకో దండంరా బాబూ.. మమ్మల్ని బతకనివ్వండ్రా అయ్యా: జనానికి హైదరాబాద్ పోలీసుల వేడుకోలు
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్.. దేశవ్యాప్తంగా భయానకంగా అలముకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో దేశం మొత్తం స్తంభించిపోయింది. దేశ ప్రజలందరూ స్వీయ గృహనిర్బంధంలో ఉంటున్నారు. స్వచ్ఛందంగా ఇళ్ల వద్దే ఉంటున్నారు. రోడ్డెక్కడానికి సాహసించట్లేదు.
ఈ పరిస్థితుల్లో కొందరు అత్యుత్సాహాన్ని చూపుతున్నారు. ఏవేవో కారణాలు చెబుతూ రోడ్ల మీద తిరిగేస్తున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించాల్సి ఉంటుందని రెండు రోజుల కిందటే ప్రధానమంత్రి ప్రకటించినప్పటికీ.. పట్టించుకోలేదు. దానికి అనుగుణంగా తమ రోజువారీ ప్రణాళికలను రూపొందించుకోలేకపోయారు. తమ పనులను వాయిదా వేసుకోవడమో లేదా ముందే ముగించుకోవడమో వంటివి చేయలేదు.
జనతా కర్ఫ్యూ ఉన్నప్పటికీ.. కొందరు వాహనదారులు ఈ మధ్యాహ్నం హైదరాబాద్లో రోడ్ల మీదికి వచ్చారు. విధి నిర్వహణలో ఉన్న హైదరాబాద్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎందుకు జనతా కర్ఫ్యూను విధించాల్సి వచ్చిందనే విషయంపై వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజలు ఎవరూ రోడ్ల మీదికి రాకుండా చూడటానికి తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని వివరించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్నప్పటికీ.. తాము మాత్రం విధి నిర్వహణలో ఉండాల్సి వచ్చిందని చేతులు ఎత్తి వాహనదారులను మొక్కడం కనిపించింది.
Recommended Video
ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటిస్తూ. ఇళ్ల వద్దే ఉంటే, తాము మిట్టమధ్యాహ్నం, మండుటెండల్లో విధి నిర్వహణల్లో పాల్గొనాల్సిన అవసరం వచ్చేది కాదని వివరిస్తున్నారు. ప్రజలందరూ ఇళ్లల్లో ఉండాలని విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ.. దాన్ని ఉల్లంఘించి మరీ రోడ్ల మీదికి రావడం సరికాదని, తమను ఇబ్బందులకు గురి చేయొద్దని వాహనదారులను వేడుకోవడం హైదరాబాద్ పోలీసుల గొప్పదనాన్ని చాటి చెబుతోంది.