వీడు మామూలోడు కాదు: ఫార్మా కాంట్రాక్టుల పేరుతో ముంచేశాడు.. ఇలా వెలుగులోకి!
హైదరాబాద్: సెల్ఫీలు చూపించి బడాబాబులతో పరిచయాలు ఉన్నాయని చెబుతాడు. ఐఏఎస్ లు అంతా తనతో టచ్ లోనే ఉంటారని నమ్మిస్తాడు. ప్రభుత్వ కాంట్రాక్టులు కావాలంటే తాను సహాయం అందిస్తానని, ఇందుకోసం కొంత లంచంగా ముట్టజెప్పాలని మెలిక పెడుతాడు. నిజమేననుకుని నమ్మితే.. అతగాడి చేతిలో మోసపోవడం ఖాయం. హైదరాబాద్ నగరంలో కాంట్రాక్టుల పేరుతో ఇలా చాలామందిని మోసం చేసిన చంద్రశేఖర్ అనే నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎవరీ రాజశేఖర్:
తూర్పు గోదావరి జిల్లా నడకుదురు చంద్రశేఖర్ స్వగ్రామం. బి.ఫార్మసీ వరకు చదువుకున్న రాజశేఖర్.. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడి బ్రోకర్ అవతారం ఎత్తాడు. ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు గుంజేవాడు. ఒకసారి డబ్బు ముట్టిందంటే ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయేవాడు.
కౌశిక్ అనే వ్యక్తి నుంచి రూ.50లక్షలు..:
కొన్ని నెలల క్రితం ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ కోల్కతాకు చెందిన కౌశిక్ అనే వ్యక్తితో చంద్రశేఖర్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇందుకు గాను రూ.50 లక్షలు కూడా తన కమీషన్ కింద తీసుకున్నాడు. అయితే డబ్బు ముట్టడమే ఆలస్యం.. మరుక్షణం నుంచి చంద్రశేఖర్ ఆచూకీ లేకుండా పోవడంతో కౌశిక్ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పల్స్ ఫార్మా డైరెక్టర్కు టోకరా..:
పల్స్ ఫార్మా డైరెక్టర్ సురేష్ బాబు కూడా చంద్రశేఖర్ చేతిలో మోసపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్ఐ, ప్రభుత్వ ఆసుపత్రులకు మెడిసిన్స్ సరఫరా చేసే కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ సురేష్ బాబును నమ్మించాడు. అంతేకాదు.. ఇందుకోసం రెండు రాష్ట్రాల ఐఏఎస్ అధికారులతో తాను మాట్లాడేశానని, వాళ్లు కూడా ఓకె చేసేశారని బోగస్ ఆర్డర్స్ తయారుచేశాడు.
ఫోర్జరీ సంతకంతో..:
కమీషన్ కింద తనకు రూ.12లక్షలు ముట్టజెప్పితేనే పని అవుతుందని సురేష్ బాబుకు చెప్పాడు. దీంతో చెప్పినంత ముట్టజెప్పాడు సురేష్ బాబు. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద పల్స్ఫార్మా కంపెనీకి రూ.7.72 కోట్లు చెల్లించాలంటూ తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఒక తప్పుడు ధ్రువ పత్రాన్ని సృష్టించాడు.
ఇలా వెలుగులోకి:
చంద్రశేఖర్ ఫోర్జరీ సంతకంతో ఇచ్చిన లేఖను తీసుకుని ఫార్మా కంపెనీ యాజమాన్యం దాన్ని మల్లాపూర్లోని ఆంధ్రాబ్యాంక్ కార్యాలయంలో సమర్పించింది. అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ సచివాలయంలోని ఆంధ్రబ్యాంక్ ఉన్నతాధికారులను సంప్రదించారు. విషయం రామకృష్ణరావు దృష్టికి తీసుకెళ్లగా.. ఇదంతా వట్టి బోగస్ అని తేలింది.
ఎట్టకేలకు అరెస్ట్:
బోగస్ అని తేలడంతో బ్యాంక్ అధికారులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్ కదలికలపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న హుంద్యాయ్ క్రెటా కారు, రెండు మొబైల్ ఫోన్స్, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతని మోసాల చిట్టా అంతా బయటపడే అవకాశముంది.