హైదరాబాద్లో జేసీ అల్లుడు, టిడిపి దీపక్ రెడ్డి దందా: విచారణలో కళ్లు తిరిగే వాస్తవాలు
హైదరాబాదులో భూకుంభకోణం కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండుకు తరలించింది. చంచల్గూడ జైలుకు తరలిస్తారు.
హైదరాబాద్: హైదరాబాదులో భూకుంభకోణం కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండుకు తరలించింది. చంచల్గూడ జైలుకు తరలిస్తారు.
అతని పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులవ విచారణలో దీపక్ రెడ్డి, ఆయన ముఠా అరాచకాలు వెలుగు చూశాయి. అవి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైద్రాబాద్లో అరెస్ట్, 'కుట్రచేశారు'
దీపక్ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన జేసీ సోదరులకు మేనల్లుడు. కాగా, హైదరాబాదులో ఆరు ప్రాంతాల్లో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో భూకబ్జా ఆరోపణలతో ఆయనను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు.
శాస్త్రీయ ఆధారాలతో దీపక్ రెడ్డిని అరెస్టు చేశారు. అతను చనిపోయిన వ్యక్తుల పేరుతో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడని తేలింది. నకిలీ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తులతో రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఆ తర్వాత కోర్టులో పిటిషన్ వేసి, బెదిరింపులకు పాల్పడేవాడు.
దీపక్కు లాయర్, మరో వ్యక్తి సహకారం
దీపక్ రెడ్డికి న్యాయవాది శైలేంద్ర సక్సేనా సహకరించేవాడు. శ్రీనివాస రావు అనే మరో వ్యక్తి కూడా సహాయం చేశాడు. దీపక్ ముఠాపై సిసిఎస్ పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. బోజగుట్టలో రూ.300 కోట్లు, బంజారాహిల్స్లో రూ.1,065 కోట్లు భూకబ్జాలకు పాల్పడ్డారు.
అందుకే అరెస్టు.. మండలి చైర్మన్కు సమాచారం
బంజారాహిల్స్, ఆసిఫ్నగర్లలో రూ.165 కోట్ల విలువైన భూములను న్యాయవాది శైలేష్ సక్సేనా సాయంతో కబ్జా చేసేందుకు యత్నించారని ఆధారాలు లభించడంతో ఇద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. దీపక్ రెడ్డి ముందస్తు బెయిలు గడువు పూర్తి కావడం, సక్సేనా బెయిలు పటిషన్ తిరస్కరణకు గురవడంతో ఇద్దరినీ అరెస్టు చేశామని డీసీపీ అవినాశ్ మొహంతీ తెలిపారు.
దీపక్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ఏపీ శాసనమండలి ఛైర్మన్కు అధికారిక సమాచారం ఇచ్చామని వివరించారు. నకిలీ పత్రాలు సృష్టించడంలో వీరికి సహకరించిన ఆర్ శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.
బంజారాహిల్స్ భూమిని ఇలా...
హైదరాబాద్లో దశాబ్దాల క్రితం నివాసమున్న కమల్ అనే శరణార్థికి చెందిన 3.37 ఎకరాల భూమి బంజారాహిల్స్లో ఉండగా 1960లో ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి అధీనంలోనే ఉంది. అక్బర్ మొహినుద్దీన్ అన్సారీ, ఖజా మొహినుద్దీన్ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులు ఆ భూమికి యజమానులుగా 2008లో సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టించాడు. వారి నుంచి దీపక్ రెడ్డి, తానూ ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పత్రాలు తయారు చేశారు. తమ భూమిని చౌదరి అండ్ బ్రదర్స్ కబ్జా చేశారంటూ శైలేష్ సక్సేనా భూకబ్జా నిరోధక కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో ఉండగా కొద్ది నెలల క్రితం చౌదరి తరఫు ప్రతినిధి రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన అసలు పత్రాలను కోర్టులో సమర్పించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. ఫిబ్రవరి 7న ఆర్థిక నేరాల విభాగం సక్సేనా తదితరులతో పాటు ఎ5గా దీపక్ రెడ్డిపై కేసు నమోదు చేసింది.
ఆసిఫ్ నగర్లో భూమిపై..
ఆసిఫ్నగర్లో మొత్తం రూ.165 కోట్ల భూములను అక్రమంగా సొంతం చేసుకునేందుకు శైలేష్ సక్సేనా పథకం వేశాడు. దీపక్ రెడ్డి ఆర్థిక సహకారాన్ని అందించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆసిఫ్నగర్లో ఒక సొసైటీకి చెందిన భూమి తమదేనంటూ సక్సేనా ఏడేళ్ల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుండగానే ప్రభుత్వానికి చెందిన 100 ఎకరాల భూమిని నిజాం నవాబు తమకు ఇనాంగా ఇచ్చారంటూ కొన్ని పత్రాలను సమర్పించాడు. ఈ రెండింటినీ సమగ్రంగా విచారించాలంటూ న్యాయస్థానం ఆదేశించడంతో సొసైటీ సభ్యులు అసలు పత్రాలను కోర్టుకు సమర్పించి పోలీసులకూ ఫిర్యాదు చేశారు. సొసైటీ భూములు సక్సేనావి కావని పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. కేసు నమోదు చేశారు. దీంతో సక్సేనా కనిపించకుండా యాడు.
మరోవైపు, తన సెక్యూరిటీ గార్డును హైదరాబాద్కు చెందిన సొసైటీ సభ్యులు అపహరించారంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్లో దీపక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు బోగస్ అని విచారణలో తేలింది.
దురుసుగా ప్రవర్తించిన దీపక్ రెడ్డి
ఈ వ్యవహారంలో దురుసుగా ప్రవర్తించిన దీపక్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్ భూమి కేసులో సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరైనప్పుడు సీసీఎస్ వెలుపల దురుసుగా ప్రవర్తించాడంటూ సైఫాబాద్ ఠాణాలో దీపక్ రెడ్డిపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ భూమి సొంతదారు చౌదరి ఇంటికి వెళ్లి బెదిరించినందుకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లోను కేసు నమోదైంది.