అరెస్ట్: డ్రాప్బాక్సులోని చెక్లను మాయం చేసి తమ పేరుతో డ్రా
హైదరాబాద్: జంట నగరాల్లోని ఏటీఎం సెంటర్లలోని చెక్లను దొంగతనం చేసి, వాటిని ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకుంటున్న పంజాబ్ ముఠాను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. పంజాబ్కు చెందిన ఆరుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వివరించారు.
ఏటీఎం సెంటర్లలోని డ్రాప్ బాక్సులో వేసిన చెక్లను మాయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఒక బృందంగా ఏర్పడి ఏటీఎం సెంటర్ల వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని మాటల్లోకి దింపి అనంతరం డ్రాప్ బాక్సుల్లోని చెక్లను మాయం చేస్తారు. ఆ తర్వాత చెక్లపై పేర్లను కెమికల్ సాయంతో తుడిచి తమ పేరుపై డబ్బును డ్రా చేసుకుంటారు.
ఈ నెల 6వ తేదీన తన చెక్ ఫోర్జరీకి గురైదంటూ ఓ కస్టమర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దాదాపు ఇలాంటి సంఘటనలే జంట నగరాల్లో పది వరకు జరిగాయని తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 11 లక్షలు రికవరీ చేసామని పోలీసులు తెలిపారు.
మరో ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు గాను రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిందితులు డ్రాప్ బాక్సుల్లోని చెక్లను మాయం చేసే సమయంలో దానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీలను సైతం తమ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. ఎవరి పేరు మీదైతే చెక్లను డ్రా చేశారో ఆ ఇళ్లను కూడా సోదాలు చేశామన్నారు.
అయితే తప్పుడు అడ్రస్లతో చెక్లను డ్రా చేసుకున్నట్లుగా తన విచారణలో వెల్లడైందన్నారు. నిందితులు నగరంలో తమకు అనుకూలంగా ఉండే అద్దె ఇళ్లలోకి దిగుతారని, అనంతరం ఇంటి యజమాని నుంచి రెంటల్ అగ్రిమెంట్ తీసుకుని దాని సాయంతో బ్యాంకుల్లో ఖాతాలను తెరుస్తారని తమ విచారణలో వెల్లడైందన్నారు.
ఆ తర్వాత ఇంటిని ఖాళీ చేసి లగ్జరీ హోటల్కు మకాం మారుస్తారని తెలిపారు. నిందితల వద్ద నుంచి కొన్ని చెక్లతో పాటు చెక్లను ఫోర్జరీ చేసేందుకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితో పాటు ఏటీఎం డ్రాప్ బాక్సులను పగలగొట్టడానికి ఉపయోగించే ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.