అది సొరంగం కాదు: భూగర్భ మహల్(పిక్చర్స్)
హైదరాబాద్: చార్మినార్ సమీపంలో తవ్వకాల్లో వెలుగు చూసింది సొరంగం కాదు, అబ్బురపరిచే భూగర్భ మహల్ అని తేలింది. అయితే తవ్వకాలు పూర్తికానందున అప్పుడే చెప్పలేమని హైదరాబాద్లోని కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రావులపల్లి కృష్ణయ్య సోమవారం మీడియాకు చెప్పారు.
తవ్వకాలు, పరిశీలన కోసం డాక్టర్ గోపాల్ రావు, బాబ్జీరావు, రామకృష్ణారెడ్డి నేతృత్వంలో రెండు బృందాలను ఆ ప్రాంతానికి పంపించామన్నారు. కాగా, నగర పోలీసు కమిషనర్ అనుమతి తీసుకోవాల్సిందిగా స్థానిక పోలీసులు సూచిస్తున్నట్టు వెల్లడించారు. ఆ స్థలంలో 50ఏళ్ళ క్రితం నిర్మించిన పోలీసుల ఇళ్లు ఉన్నాయన్నారు. అవి పాతబడటంతో వాటిస్థానే కొత్తగా పోలీసు క్వార్టర్లు కట్టేందుకు పనులు ప్రారంభిస్తున్న సమయంలో, మహల్గా భావించే సొరంగం బయటపడిందన్నారు.
పురావస్తు శాఖ భావిస్తున్నట్టు అది మహలే అయితే, ఇప్పుడు మనం చూస్తున్న, నిర్మిస్తున్న సెల్లార్లు 400 ఏళ్ల క్రితమే ఉన్నట్టు తేలుతుందన్నారు. కులీకుతుబ్షా కాలంనాటిదిగా భావిస్తున్న ఈ నిర్మాణం నర్తకీమణుల నాట్య ప్రదర్శనల కోసం నిర్మించారా? లేక విశ్రాంతి భవనమా? అనేది పురావస్తు శాఖ పరిశోధనలోనే తేలనుంది.
ఆదివారం తవ్వకాల్లో వెలుగుచూసిన రెండు మార్గాలూ.. మహల్లోకి ప్రవేశించే ద్వారాలా? లేక గాలి, వెలుతురు కోసం నాడు ‘ఆర్చ్' (కమాన్) నిర్మించారా? అనే కోణంలో పరిశోధన జరగాల్సి ఉంది. అయితే పోలీసుల అభ్యంతరాలతో పనులు చేపట్టలేకపోయామని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.