డేటా చోరీలో షాకింగ్: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు, వాళ్లు ఎందుకిలా చేశారో.. సీపీ సజ్జనార్
హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఎంతటి వారినైనా వదిలేది లేదని చెప్పిన సైబరాబాద్ సీపీ సజ్జనార్.. ఈ కేసులో ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసును ఏపీ పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని చెప్పారు. మా పరిధిలో కేసు విచారణ జరుగుతుంటే ఏపీ పోలీసులు ఇష్టారీతీలో కల్పించుకున్నారని, ఐడీ గ్రిడ్ సంస్థ ఉద్యోగులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఐటీ గ్రిడ్ కేసును ఏపీకి బదలాయించమని చెప్పారు.
ఒక మిస్సింగ్ కేసు కోసం వస్తారా
డేటా చోరీకి పాల్పడ్డ ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు తమవద్దే ఉన్నారని చెప్పినా, వారి కుటుంబ సభ్యుల ద్వారా స్టేట్మెంట్ తీసుకోవడమే కాకుండా, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ చేశారని సీపీ సజ్జనార్ చెప్పారు. తాము విచారించిన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ పోలీసులు ఏం అడిగారని తెలుసుకున్నారని, ఒక మిస్సింగ్ కేసు కోసం ఏసీపీ స్థాయి అధికారి వస్తారా అని ప్రశ్నించారు.
ఏపీ పోలీసులు ఇలా ఎందుకు చేశారో
ఏపీ పోలీసులు ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదని సీపీ సజ్జనార్ అన్నారు. అంతేకాకుండా డేటా చోరీపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిని బెదిరించిన అంశంలోను కేపీహెచ్బీ పీఎస్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అత్యంత సున్నితమైన డేటాను ప్రయివేట్ సంస్థలకు ఎలా ఇస్తారన్నారు. ఆ అధికారం ఎవరిచ్చారన్నారు. పెదకాకానీలో ఐదున్నర గంటలకు కేసు నమోదయితే తొమ్మిది గంటల వరకల్లా ఏపీ పోలీసులు హైదరాబాద్ ఎలా వచ్చారన్నారు. మూడు గంటల్లో ఎలా వచ్చారన్నారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న అందర్నీ పిలుస్తాం
తాము ఐటీ గ్రిడ్ ఉద్యోగులను విచారిస్తుంటే అదే సమయంలో ఉద్యోగుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారని సీపీ సజ్జనార్ చెప్పారు. ఓపీ ఓటర్ల వివరాలు టీడీపీ యాప్ సేవామిత్రకు ఎలా వస్తాయన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని అందరినీ పిలుస్తామని చెప్పారు. తన కంపెనీలో సోదాలు జరిగితే ఎండీ అశోక్ ఎక్కడ అన్నారు.
ఏపీ పోలీసులపై కేపీహెచ్బీలో కేసు నమోదు
ఇదిలా ఉండగా, లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఏపీ పోలీసులపై కేసు నమోదయింది. ఐటీ గ్రిడ్ పైన సైబరాబాదులో అంతకుముందు ఫిర్యాదు చేశాడు లోకేశ్వర్ రెడ్డి. కేసు విచారణ జరుగుతుండగా ఏపీ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. అతనిని తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అతనిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేశారనే ప్రచారం సాగుతోంది. దీంతో లోకేశ్వర్ రెడ్డి కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీ పోలీసులపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీలో అశోక్.. కేసు నమోదు
ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ మూడు రోజులుగా ఏపీలోనే మకాం ఉన్నాడని తెలుస్తోంది. ఆయన గుంటూరు, విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అశోక్ కోసం హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేశారని దశరథ రామిరెడ్డి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. అశోక్ పైన కేసు నమోదయింది. అశోక్పై ఐపీసీ సెక్షన్ 420, 419, 467స 468, 120 కింద కేసు నమోదు చేశారు. తమకు డేటా ఇక్కడే దొరికింది కాబట్టి ఈ కేసును ఇక్కడే దర్యాఫ్తు చేస్తామని చెప్పారు.