జగన్ మామపై భూకబ్జా కేసు, అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మామ, ఆ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పైన భూకబ్జా కేసు నమోదయింది. సైబరాబాదు పోలీసులు అతనిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారని తెలుస్తోంది.
2012లో నమోదైన ఈ కేసు నిన్నటిదాకా మూసేసిన స్థాయిలో ఉందని అంటున్నారు. ఇటీవలే ఈ కేసు ఫైలుకు పోలీసులు బూజు దులిపారు. కేసు రిజిష్టర్ అయిన సందర్భంగా సేకరించిన ఆధారాలతో పాటు తాజాగా మరికొన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డి భూకబ్జాకు పాల్పడ్డారని నిర్ధారించారు.
దీంతోనే ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవీంద్రనాథ్ రెడ్డి ఏ-5గా ఉండగా, ముగ్గురు కీలక నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆయన హైదరాబాద్లో భూఅక్రమాలకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. రవీంద్రనాథ రెడ్డిని పరారీలో ఉన్న నిందితుడుగా ప్రకటించి, ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
2012లో నమోదైన కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి, బుధవారం ఆ వివరాలను మీడియాకు విడుదల చేశారు. రాష్ట్ర విభజనకు ముందు మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో కోట్ల రూపాయల విలువైన భూములపై కన్నేసిన ఓ ముఠా తప్పుడు పత్రాలతో వాటిని కొట్టేసింది.
బినామీలను రంగంలోకి దింపి వాటిని కొనుగోలు చేయించారు. అడ్డంకులన్నీ తొలగిపోయిన తర్వాత రవీంద్రనాథ రెడ్డి తెరపైకి వచ్చారు. ఆ భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకన్నారు. కేసు దర్యాప్తు ఇన్నాళ్లు నత్తనడకన సాగడంతో రవీంద్రనాథ్ రెడ్డి తప్పించుకు తిరిగారు. ఇప్పుడు ఆయనను కేసులో ఐదో ముద్దాయిగా చేర్చి, అరెస్టు కోసం చర్యలు మొదలు పెట్టారు.
ఇదీ కేసు..
మాదాపూర్లో సర్వే నెంబర్ 11/30లో ప్లాట్ నెంబరు 864లో 300 చదరపు గజాల స్థలం ఉంది. ఆ స్థలం మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన దామలచెరువు ప్రమీల అనే వృద్ధురాలు పేరిట రిజిస్టరయి ఉంది. ఈ ఆస్తి పైన కొందరి కన్ను పడింది. అంగబలం, అర్ధబలంతో ఆక్రమించాలని చూసి విఫలమయ్యారు.
అదే సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన శీనం ప్రతాప్ రెడ్డి, గోపవరపు నర్సింహా రెడ్డి, రాజిరెడ్డితోపాటు హైదరాబాద్ ఆల్వాల్కు చెందిన ప్రతాప్ రెడ్డిలు రంగంలోకి దిగారు. ఆ స్థలానికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారు. ఫోర్జరీ సంతకాలు చేశారు. స్థలం తమదేనని ప్రకటించుకున్నారు.
చుట్టు పక్కల ఉన్న ప్లాట్లను కూడా కలిపేసుకున్నారు. ఫోర్జరీ పత్రాలను ఆధారంగా చేసుకుని ఆ స్థలాన్ని రవీంద్రనాథ్ రెడ్డి బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. శీనం ప్రతాప రెడ్డి ముఠాకు రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడి బ్యాంకు ఖాతా ద్వారా రూ.25 లక్షలు చెల్లించి భూమిని కొనుగోలు చేసినట్లుగా చూపించారు. అయితే, అసలు యజమాని దామర చెరువు ప్రమీల న్యాయం కోసం అడిగితే బెదిరించారు.