'డబ్బు ఆశతో కాదు': బురిడీబాబా ఎందుకొచ్చాడంటే..!, కోర్టులో హాజరు
హైదరాబాద్: తాము గృహప్రవేశం కోసం శివానందను ఆహ్వానించామని, డబ్బుఆశతో కాదని లైఫ్ బిల్డింగ్ యజమాని, రియల్టర్ మధుసూదన్ రెడ్డి కుమారుడు సందేశ్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని, రియల్టర్ మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేసి ఒక కోటి 30 లక్షల రూపాయలు కాజేసిన కేసులో అరెస్ట్ చేసిన శివానందబాబాను శనివారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు.
ఈ కేసులో శివానందబాబాకు సహకరించిన ఈగ దామోదర్, శ్రీనివాస్రెడ్డిలను శివబాబాతో పాటు కోర్టుకు తరలించారు. తొలుత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
దీంతో అతనిని పోలీసులు చంచల్ గూడ జైలుకి తరించారు. లైఫ్స్టైల్ భవన యజమాని మధుసుదన్రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు మత్తు మందు కలిపిన ప్రసాదం ఇచ్చి డబ్బులు దొంగిలించిన బాబాను పోలీసులు 24 గంటల్లో పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ప్రధాన నిందితుడు బురిడీ బాబా అలియాస్ శివానందబాబా స్వస్థలం చిత్తూరు జిల్లా కుప్పం తాలూకా ఒండగంపల్లి గ్రామమని పోలీసులు వెల్లడించారు. బురిడీ బాబాపై గతంలో అనేక ప్రాంతాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. తన గురువు అనంతాచార్యులతో కలిసి 2009లో కేపీహెచ్బీ కాలనీలో లక్ష్మీ పూజ చేసి రూ.25 లక్షలు కాజేశాడు.
ఆ తర్వాత కొద్ది రోజులకు బెంగళూర్లోని కుమ్మలగూడలో రూ.40 లక్షలు, కర్ణాటక కొలైగల్ తాలూకా చామరాజ్ నగర్లో శనేశ్వర్ బాబాతో కలిసి రూ.10 లక్షలకు టోపీ పెట్టాడు. శివ, అనంతాచార్యులను 2009లో కూకట్పల్లి పోలీసులు, బెంగళూరులోని కెంజరి, చామ్రాజ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు.
మరోవైపు మధుసూదన్ రెడ్డి ఇంట్లో బురిడీ బాబా దొంగలించిన రూ. 1.33 కోట్ల నగదుపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. అంత మొత్తం డబ్బు ఇంట్లో ఎందుకుంది? అది నల్ల డబ్బా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆదాయ పన్ను శాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు వెళ్లి మధుసూదన్ రెడ్డి కేసు వివరాలు తెలుసుకున్నారు.
గతంలో మధుసూదన్ రెడ్డి ఆదాయ పన్నును ఎగవేసినట్లు పోలీసులకు తెలిపారు. బురిడీ బాబా నుంచి రికవరీ చేసుకున్న సొమ్మును తమకు అప్పగించాలని కోరారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో డిపాజిట్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమను సంప్రదిస్తే నిబంధనల మేరకు న్యాయస్థానం నుంచి తీసుకోవచ్చని తెలిపారు.