కరీంనగర్లో పేలుడు పదార్థాల పట్టివేత: హైదరాబాద్ పాతబస్తీలో నిందితుడి అరెస్ట్
కరీంనగర్/హైదరాబాద్: కరీంనగర్లో పట్టుబడిన డిటోనేటర్ పేలుడు పదార్థాలతో హైదరాబాద్ పాతబస్తీకి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గన్పౌడర్తో తక్కువ సామర్థ్యం కలిగిన డిటోనేటర్లు తయారు చేస్తున్న ముఠాగుట్టును రట్టు చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఫలక్నుమా పరిధిలోని వాట్టేపల్లిలో గన్పౌడర్ తయారీ కేంద్రంపై కరీంనగర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
కరీంనగర్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డిటోనేటర్ పేలుడు ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పాతబస్తీలోని పేలుడు పదార్థాల తయారీ కేంద్రానికి సంబంధించిన విషయం బయటపడింది. పేలుడు పదార్థాల తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించిన పోలీసులు.. పెద్ద మొత్తంలో డిటోనేటర్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
గన్ పౌడర్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్న షబ్బీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఫలక్నుమా పోలీసులకు అప్పగించారు. గన్ పౌడర్ తయారీ కోసం తీసుకున్న లైసెన్స్ 2018లో ముగిసినప్పటికీ.. షబ్బీర్ అలియాస్ మహ్మద్ జైనుల్లా హబీబ్ దాన్ని రెన్యూవల్ చేసుకోలేదు. అయితే, ఫాతీమానగర్లో బొగ్గు విక్రయానికి లైసెన్స్ కలిగిన హమీద్ ఖాన్ తో కలిసి ఆ ప్రాంతంలోనే గన్ పౌడర్ చేయడం మొదలుపెట్టాడు.
గన్ పౌడర్ తోపాటు డిటోనేటర్ పేలుడు పదార్థాలను తయారుచేసి కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జామ్ బాగ్లోని ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ద్వారా కరీంనగర్కు సరఫరా చేసినట్లు తెలిసింది. పాలిష్ పౌడర్ అని తప్పుడు పత్రాలు సృష్టించి గన్ పౌడర్ను కరీంనగర్కి అక్రమంగా రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.