వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు హైదరాబాద్ పోలీసులు షాక్: కొన్ని గంటల ముందు..!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్షకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. నిరుద్యోగుల సమస్యల తరఫున పోరాటానికి దిగాలని నిర్ణయించుకున్న ఆమె ముందరి కాళ్లకు బంధం వేశారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ప్రతినిధిగా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ కోసం మూడురోజుల పాటు నిరాహార దీక్షకు పూనుకున్న వైఎస్ షర్మిలకు.. ఆమె కోరిన విధంగా అనుమతి ఇవ్వలేదు. నిరాహార దీక్ష ఒక్కరోజు మాత్రమే నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు సర్వం సిద్ధం: పోలీసులకు లేఖ: ఆర్ కృష్ణయ్య మద్దతు?
ఖమ్మంలో నిర్వహించిన సంకల్పసభలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ షర్మిల మూడురోజుల పాటు నిరహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. షర్మిల పార్టీ నాయకులు రూపొందించుకున్న షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం లోయర్ ట్యాంక్బండ్లోని ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటలకు ఆమె నిరాహార దీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. 18వ తేదీ ఉదయం 11 గంటలకు విరమించాల్సి ఉంది. ఈ మూడురోజుల పాటు దీక్షను నిర్వహించడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ షర్మిల పార్టీ నేతలు హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులకు వినతిపత్రం అందజేశారు.
కోవిడ్ ప్రొటోకాల్స్ను పాటిస్తూ, శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తామని వారు హామీ ఇచ్చారు. వారి అభ్యర్థనను సెంట్రల్ జోన్ పోలీసులు పాక్షికంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. మూడు రోజులకు బదులుగా ఒక్కరోజు మాత్రమే నిరాహార దీక్షను నిర్వహించడానికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలిపినట్లు ప్రచారం సాగుతోంది. దీనితో షర్మిల పార్టీ నేతలు మరోసారి పోలీసులకు విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.