కెనడాలో ఎంఎస్ చేసి.. ఎఫ్బీలో జాబ్ వదిలేసి.. డ్రగ్స్ డెలివరీ బాయ్గా మారాడు: చివరకు..
హైదరాబాద్: కెనడాలో ఉన్నత చదువులు చదివాడు. పలు సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. చివరకు గంజాయి డెలివరీగా బాయ్గా మారి కటకటాలపాలయ్యాడు. ఇదంతా సికింద్రాబాద్ కవాడీగూడకు చెందిన బాలాజీసింగ్ గురించి.
కెనడాలో ఎంఎస్ పూర్తి చేసి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీసింగ్ కెనడాలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్లో ఫేస్బుక్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. అంత బాగానే ఉన్నా.. ఆ తర్వాత మత్తు పదార్థాలకు బానిసై ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఉపాధి కోసం డెలివరీ బాయ్గా మారాడు.
గంజాయి డెలివరీ బాయ్గా..
ఓ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో చేరి.. డెలివరీ బాయ్గా పనిచేస్తూనే.. దూల్పేటలో గంజాయి విక్రేతలతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్లు ఇచ్చే గంజాయిని గచ్చిబౌలిలోని కొందరు ఐటీ ఉద్యోగులు, మాదాపూర్లోని హాస్టల్ విద్యార్థులకు సరఫరా చేసేవాడు. అంతేగాక, విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు.
ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్..
ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లిన బాలాజీసింగ్ గంజాయితోపాటు మత్తు ద్రావణాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. వాటిని ప్యాకెట్లలో నింపి ఐటీ ఉద్యోగులు, కాలేజీ యువతకు సరఫరా చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు బాలాజీసింగ్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 800 గ్రాముల మత్తు ద్రావణంతోపాటు కిలో గంజాయి, ఓ బైక్, ఫోన్ సీజ్ చేశారు.
Recommended Video
ఉద్యోగాల పేరుతో లక్షలు వసూళ్లు.. చివరకు
ఇది ఇలావుండగా, హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 3 కోట్లు వసూలు చేసి మోసగించిన తిరునహరి విష్ణుమూర్తి, కొట్మికర్ మహావీర్లను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా తమ్మడపల్లికి చెందిన విష్ణుమూర్తి.. హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్, అటెండర్, సిబ్బంది నియామకాలకు నకిలీ నోటిఫికేషన్ రూపొందించి.. హన్మకొండలో దూరవిద్య కేంద్రం నిర్వహిస్తున్న తల్లపల్లి సంజయ్, నాగర్ కర్నూల్కు చెందిన దశరథ్తో కలిసి వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. కాగా, దబీర్పూర పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే మహావీర్ ఆ నోటిఫికేషన్ను హైకోర్టు నోటీసు బోర్డులో పెట్టారు. ఇదంతా నమ్మిన 162 మంది నిరుద్యోగుల నుంచి రూ. 2.5 లక్షల చొప్పున వసూలు చేశారు. అయితే, ఏడాది గడిచినా ఉద్యోగానికి సంబంధించిన ఎలాంటి వివరాలు లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు విష్ణుమూర్తి, మహావీర్లను అరెస్ట్ చేశారు.