హైదరాబాద్ లో భారీ వర్షానికి ఇద్దరు బలి.. కరెంట్ తీగలు తెగిపడి..
హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం భీకర వర్షం నమోదైంది. భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగి పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాలెడ్జ్ సిటీ నుంచి 11 కిలోమీటర్ల గమ్యం చేరుకోవడానికి ఏకంగా గంటన్నరకు పైగా గూగుల్ మ్యాప్ లో చూపించడంతో వాహనదారులు కంగు తిన్నారు. ఇక కూకట్ పల్లి, కేపీహెచ్ బీ కాలనీ, మియాపూర్, హైటెక్ సిటీ, చందానగర్, ముషీరాబాద్, లక్డీకాపూల్, సరూర్నగర్, కోఠి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్నగర్, బాగ్ లింగంపల్లి, రామ్ నగర్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ప్రజలు వర్షంలోనే తడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే భాగ్యనగరంలో వర్షానికి ఇద్దరు యువకులు బలయ్యారు. పాతబస్తీలోని బండ్లగూడలో జాఫర్(25), అబూ(16) అనే ఇద్దరు యువకులు అప్పుడే ఆటో దిగి నీటిలో అడుగుపెట్టిన వెంటనే విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. వర్షం కారణంగా అప్పటికే కరెంట్ తీగలు తెగిపడి నీటిలో పడినట్లు తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఛత్తా బజార్ లో రోడ్డుపై కమాన్ కూలింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం, ఆస్తినష్టం తప్పింది.

ఇక హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సమస్యను పరిష్కరించేందుకు హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ట్యాంక్ బండ్ పై వరద నీటి మళ్లింపు, కూలిన చెట్ల తొలగింపును పర్యవేక్షించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతన్నాయని అన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు హైడ్రా సిబ్బంది కృషి చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications