హైదరాబాద్ వరద బీభత్సం: చలించిన ముఖ్యమంత్రి: భారీగా ఆర్థికసాయం: కేసీఆర్కు లేఖ: దేనికైనా
చెన్నై: ఎప్పుడూ లేనివిధంగా.. హైదరాబాద్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కొద్దిరోజుల తేడాతో రెండుసార్లు కురిసిన అతి భారీ వర్షాలతో భాగ్యనగరం చెల్లాచెదురై పోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఇదివరకు ఒకసారి కురిసిన భారీ వర్షాలకే హైదరాబాద్ చివురుటాకులా వణికిపోయింది. మూడురోజుల వ్యవధిలో జంటనగరాలను మూడు రోజుల వ్యవధిలో మరోసారి సంభవించిన భారీ వర్షాలు, ఫలితంగా ఏర్పడిన వరదలూ.. మరింత కుంగదీశాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో భీతిల్లిపోతున్నారు హైదరాబాదీలు.
చైనా వెన్నుపోటు: భారత్పై గూఢచర్యం: లఢక్ వద్ద కలకలం: జవాన్ల చేతిలో బందీగా సైనికుడు
కేసీఆర్కు ఎడప్పాడి లేఖ..
హైదరాబాద్ నగరం సహా శివార్లలోని అనేక ప్రాంతాల్లో మట్టి కొట్టుకునిపోయాయి. బురదతో నిండిపోయాయి. మూసీనది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారీ వాహనాలు సైతం కాగితపు పడవల్లా వరద నీటిలో కొట్టుకుని పోతోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాలనీలకు కాలనీలు రోజుల తరబడి వాననీటిలో నానుతున్నాయి. ఈ పరిణామాల పట్ల తమిళనాడు ప్రభుత్వం చలించిపోయింది. వెంటనే తనవంతుగా భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.
రూ.10 కోట్ల ఆర్థిక సహాయం..
వరద సహాయ కార్యక్రమాల కోసం 10 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ మొత్తాన్ని వెంటనే జమ చేయాలని ఆదేశించినట్లు పళనిస్వామి తన లేఖలో వెల్లడించారు. వరదల బారిన పడిన ప్రజలను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకుందని ఆయన పేర్కొన్నారు. వరద బాధితుల కోసం సహాయక చర్యలను తీసుకోవడం, వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడంలో సఫలమైందని చెప్పారు.
త్వరలో దుప్పట్లు.. ఇతర సహాయక సామాగ్రి..
వరద సహాయక చర్యలను త్వరితగతిన చేపట్టడంలో తెలంగాణ అధికార యంత్రాంగం చొరవ చూపిందని పళనిస్వామి అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాము తెలంగాణ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటామని పళనిస్వామి తెలిపారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. వరద బాధితుల కోసం దుప్పట్లు, ఇతర సహాయక సామాగ్రి పెద్ద ఎత్తున పంపిస్తామని పళనిస్వామి చెప్పారు.
Recommended Video
కృతజ్ఙతలు తెలిపిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడు.. ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే అందజేయడానికి తాము సన్నద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా- తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..ఎడప్పాడి పళనిస్వామికి కృతజ్ఙతలు తెలిపారు. ఆపత్కాలంలో మానవతాదృక్పథాన్ని ప్రదర్శించారని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించడం, వెంటనే 10 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయడం హర్షణీయమని అన్నారు. తమిళనాడు ప్రజలు ఎల్లప్పుడూ తెలంగాణ పట్ల సోదరభావంతో మెలగుతారని చెప్పారు.