తీర్పు చెప్పాల్సిన జడ్జీనే దారి తప్పాడు..ఇంతకీ ఏంచేశాడు..?
నిందితులకు తీర్పు చెప్పి శిక్ష విధించాల్సిన న్యాయమూర్తే ఇప్పుడు బోనులో నిలచోనున్నాడు. మరో జడ్జి ఆయన చేసిన పనికి తీర్పు ఇవ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి వి.వరప్రసాద్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ క్రమంలోనే ఆయన అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. దీంతో వరప్రసాద్ను అరెస్టు చేసి తాను జడ్జిగా వ్యవహరించే కోర్టులోనే పోలీసులు ప్రవేశపెట్టారు. దీంతో ఆయన్ను 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం వరప్రసాద్ను చంచల్గుడా జైలుకు తరలించారు.
జడ్జీ అక్రమాస్తుల విలువ రూ. 3కోట్లు
వరప్రసాద్ ఆస్తులపై సోదాలు నిర్వహించగా ఆయన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 3 కోట్లు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై పలు సెక్షన్లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం వరప్రసాద్ నివాసంపై దాడులు చేసింది ఏసీబీ. గురువారం ఉదయం వరకు సోదాలు జరిగాయి. ఆ తర్వతే వరప్రసాద్ను అరెస్టు చేశారు. సోదాలు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా జరిగాయి.
హైదరాబాద్, సిరిసిల్లా, మహారాష్ట్రల్లో ఏకకాలంలో సోదాలు
గడ్డి అన్నారంలోని తన ఇంటితో పాటు కొండాపూర్లోని మరో ఇంటిపై కూడా దాడులు జరిగాయి. వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. సిరిసిల్లలోని మూడు ప్రాంతాల్లో, హైదరాబాద్లోని నాలుగు ప్రాంతాల్లో మహారాష్ట్రలో రెండు ప్రాంతాల్లో నివసిస్తున్న బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఇదిలా ఉంటే ప్రాథమిక విచారణ ఆధారంగా ఆయనపై అక్రమాస్తుల కేసును నమోదు చేయాలని హైకోర్టు అంతకుముందు ఆదేశించింది. ఇదిలా ఉంటే తెలంగాణలో జడ్జీల ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం ఇది ఐదో సారి. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జడ్జీల్లో వరప్రసాద్ ఐదవ వ్యక్తి.
ఇప్పటి వరకు ఏసీబీ వలలో ఐదుగురు జడ్జీలు
అంతకుముందు ఏప్రిల్లో మహబూబ్నగర్ జిల్లా జడ్జి కొల్ల రంగారావు అక్రమాస్తుల కేసులో సస్పెండ్ అయ్యారు. అదే నెలలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జీ రాధాకృష్ణమూర్తి పై అవినీతి ఆరోపణలు రావడంతో హైకోర్టు అతన్ని సస్పెండ్ చేసింది. జగిత్యాల జిల్లా జడ్జి ఎస్ మధు కూడా లంచం తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో ఆయనపై కూడా వేటు పడింది. ఇక మార్చిలో హైదరాబాద్లోని లేబర్ కోర్టు జడ్జి గాంధీ ఏసీబీ దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడటంతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో సరైన లెక్కలు చూపకపోవడంతో గాంధీని ఏసీబీ అరెస్టు చేసింది.