విద్యార్థులే లక్ష్యంగా లిక్కర్ చాక్లెట్లు: ఇద్దరు అరెస్ట్, ‘డెన్మార్-ఢిల్లీ-హైదరాబాద్కు’
హైదరాబాద్: విద్యార్థులే లక్ష్యంగా మత్తు పదార్థాల అమ్మకాలు సాగిస్తున్న ముఠా ఆటకట్టించారు ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఢిల్లీ కేంద్రంగా నగరంలోని బేగం బజార్, అబిడ్స్లో లిక్కర్ చాక్లెట్ల స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలను ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ఆయా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో లిక్కర్ చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్కు పాల్పడుతున్న షాప్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అబిడ్స్లోని కమల్ వాచ్స్అండ్గిఫ్ట్స్ కంపెనీ షోరూం, బేగంబజార్, సిద్దంబర్ బజార్లోని హీరా కాంప్లెక్స్ చాక్లెట్ డిస్టిబ్యూటర్ కంపెనీపై దాడులు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
పలు బ్రాండ్ల పేరుతో లిక్కర్ చాక్లెట్ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు, ఐటీ నిపుణులు, పాఠశాల విద్యార్థులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. మొత్తంగా 1081 బాక్స్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
విదేశీ మాదక ద్రవ్యంలో వీటి విలువ లక్షల్లో ఉంటుందని పేర్కొన్నారు. అమీర్పేటలోని ఓ ఇంట్లో దాడి చేసిన అధికారులు.. లిక్కర్ చాక్లెట్లు తయారు చేస్తున్న గొల్లపల్లి శ్రీధర్ను అరెస్ట్ చేశారు. ఆ చాక్లెట్లలో విస్కీ, రమ్ కలుపుతున్నారని అధికారులు తెలిపారు. డెన్మార్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇలాంటి చాకెట్లు.. అక్కడ్నుంచి నగరానికి వస్తున్నాయని తెలిపారు.
శ్రీధర్ తోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన అధికారులు.. వారి ఇచ్చిన సమాచారం ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఒక్కో లిక్కర్ చాక్లెట్ ధర రూ. 200-రూ.1500 వరకు నిర్ణయించి అమ్ముతున్నారని తెలిసింది. అయితే, ఈ చాక్లెట్లు విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు తెలిపారు.