ప్రేమోన్మాది అమిత్సింగ్ ఆచూకీ లభ్యం: యూపీకి పోలీస్ బృందాలు
హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కా చెల్లెళ్లను దారుణంగా హత్యచేసి పారిపోయిన అమిత్సింగ్ ఆచూకీని సైబరాబాద్ పోలీసులు కనుగొన్నట్లు విశ్వసనీయ సమాచారం. అమిత్సింగ్ ఆచూకీ కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అతను స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించాయి.
బుధ, గురువారాల్లో అమిత్సింగ్ తన తండ్రి అమర్ సింగ్తోపాటు తల్లి, చెల్లెలితో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్కాల్స్ ఆధారంగా అమిత్సింగ్ ఉత్తరప్రదేశ్లోని స్వగ్రామంలో తలదాచుకున్నాడని భావిస్తున్నారు.
అతన్ని అదుపులోకి తీసుకొనేందుకు రెండు ప్రత్యేక బృందాలు యూపీకి వెళ్ళాయి. అయితే శ్రీలేఖ, యామిని సరస్వతిలను హత్యచేసిన తర్వాత అమిత్ ఢిల్లీలోని తన సోదరి ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. అక్కడి నుంచి యూపీకి వెళ్లాడని సమాచారం. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు.
మూడు రోజుల క్రితం అమిత్ సింగ్ తను ప్రేమించిన శ్రీలేఖ తోపాటు ఆమె అక్క యామిని సరస్వతిలను హత్య చేసిన విషయం విధితమే. ఆ తర్వాత నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనను మర్చిపోవాలని చెప్పి.. పరారయ్యాడు.