‘సత్యభామ’లో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య, ‘మిస్ యూ ఆల్’ అంటూ మెసేజ్
చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతున్న హైదరాబాద్కు చెందిన రాధ మౌనిక హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్: చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో ఓ తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. హైదరాబాద్కు చెందిన రాధ మౌనిక ఈ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇంజినీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతోంది.
రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా మౌనిక కాపీ కొట్టిందని.. దీంతో ఆమెను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారని, తదుపరి పరీక్షలకు కూడా అనుమతించ లేదని తెలుస్తోంది.
దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన స్నేహితులకు మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని మెసేజ్ పెట్టింది.
మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్రు చేస్తున్నారు. ఓ తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య ఘటన చెన్నైలో విద్యాబ్యాసం చేస్తున్న విద్యార్థుల్లో బయాందోళనలు కలిగిస్తోంది.