హైదరాబాద్ స్విగ్గీ డెలివరీ బాయ్కి కరోనా పాజిటివ్: ఎంత మందికి అంటించాడో.?
హైదరాబాద్: ఢిల్లీలో ఫుడ్ డెలివరీ బాయ్ ఘటన మరువకముందే నగరంలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో ఓ స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలంగా మారింది. రాష్ట్రంలో ఇలా ఫుడ్ డెలివరీ బాయ్కి కరోనా సోకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Recommended Video
కరోనా పాజిటివ్ అని రిపోర్టు..
రెండ్రోజుల క్రితం అతని నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. తాజాగా, ఆ పరీక్షలకు సంబంధించిన నివేదిక వచ్చింది. అందులో సదరు ఫుడ్ డెలివరీ బాయ్కి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఎంతమందికి ఫుడ్ డెలివరీ చేశాడో..
నాంపల్లికి చెందిన సదరు యువకుడిని పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే, అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు స్విగ్గీ డెలివరీ బాయ్ గత కొద్ది రోజులుగా ఎంత మందికి ఫుడ్ డెలివరీ చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆ హోటళ్లు, రెస్టారెంట్లకు ముందు జాగ్రత్తగా..
ఆ యువకుడితోపాటు అతని కుటుంబంలోని మరో ముగ్గురిని కూడా క్వారంటైన్ తరలించారు. గత 14 రోజులుగా ఏ రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి ఫుడ్ సేకరించాడు, ఏ ప్రాంతంలో ఎన్ని ఇళ్లకు వాటిని చేరవేశాడు అనేదానిపై పోలీసులు విస్తృతంగా ఆరా తీస్తున్నారు. అతడు సందర్శించిన హోటళ్లు, రెస్టారెంట్లను ముందు జాగ్రత్త చర్యగా మూసివేయాలని ఆదేశించారు. ఎవరికి అనుమానం వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన సదరు స్విగ్గీ డెలివరీ బాయ్.. లాక్డౌన్ విధించకముందు నుంచే(గత 28 రోజులలో) ఎలాంటి ఫుడ్ డెలివరీ చేయలేదని స్విగ్గీ యాజమాన్యం తెలిపింది.
హైదరాబాద్లో పెరుగుతున్న కేసులు..
ఇది ఇలావుండగా, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిలో ఆదివారం మరో 17 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి కూడా టెస్టులు చేశామని చెప్పారు. వారిని కూడా క్వారంటైన్ కు తరలించినట్లు చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే సుమారు 800 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. 18 మరణాలు సంభవించాయి.