టెక్కీ భార్య చివరి మాటలివే!: భర్తకు పంపిన మెసేజ్లో ఏముందంటే..
మృతురాలి నుదురు, మెడపై గాయాలు ఉండటంతో పద్మజ మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. పద్మజను భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్: కూతురంటే వాళ్లకు ప్రాణం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్నారు. పెళ్లి చేస్తే పంపిస్తే.. ఎక్కడ తమకు దూరమవుతుందోనని ఎన్నో సంబంధాలని తిరస్కరిస్తూ వచ్చారు. చివరకు గిరీశ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంబంధం రావడం.. తమ ఇంటికి దగ్గరలోనే అతనూ ఉంటుండంతో ఆ సంబంధాన్ని ఖాయం చేశారు.
మంచి ఉద్యోగం.. ఉన్నత కుటుంబం.. తమ కళ్ల ముందే ఉన్నట్లు ఉంటుందని మరో మాట లేకుండా సంబంధానికి ఒప్పేసుకున్నారు. కానీ పెళ్లయిన 14నెలలకే కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో.. గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని.. కట్నం కోసమే కూతురిని బలితీసుకున్నారని ఆరోపిస్తున్నారు.
కట్నం వేధింపులేనా?:
గిరీశ్ తో పద్మజకు వివాహం నిశ్చయించిన తర్వాత.. ఎకరం పొలంతో పాటు మరో 14 తులాల బంగారాన్ని ఇస్తామని పద్మజ తల్లిదండ్రులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకున్న సమయానికి అంతా సర్దుబాటు కాకపోవడంతో.. కేవలం నాలుగు తులాల బంగారం రూ.2లక్షల నగదు ఇచ్చి పద్మజ తల్లిదండ్రులు వివాహం జరిపించారు.
అయితే అప్పట్లో ఆ విషయాన్ని అంతగా పట్టించుకోని అత్తింటివారు.. ఉద్యోగం చేసే కోడలు ఇంట్లో ఉంటే చాలంటూ మురిసిపోయారు. గతేడాది ఏప్రిల్ 20న వీరి వివాహం జరిగింది. అప్పటికి పద్మజ కుటుంబం కొండాపూర్ శ్రీరాంనగర్ లో ఉంటుండగా.. గిరీశ్ కుటుంబం గచ్చిబౌలిలోని సుదర్శన్ నగర్ లో ఉంటోంది.
భర్త సాఫ్ట్ వేర్.. భార్య బ్యాంక్ ఎంప్లాయ్:
ఎంబీఏ పూర్తిచేసిన పద్మజ గత 11ఏళ్లుగా మాదాపూర్లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది. భర్త గిరీశ్ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకే అత్తింటివారి నుంచి వరకట్న వేధింపులు మొదలవడంతో పద్మజ ఆశలన్ని నీరుగారిపోయాయి.
కన్నవాళ్లకు చెబితే తట్టుకోలేరనే బాధతో తనలో తానే కుమిలిపోయింది. చీటికి మాటికి భర్త పెట్టే గొడవలను మౌనంగా భరిస్తూ వచ్చింది. రోజులు గడిచే కొద్ది భర్త ప్రవర్తన మరింత మితిమీరడంతో.. ఇక ఆ క్షోభను భరించలేకపోయింది. ఈ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడమే ఇక దీనికి పరిష్కారం అని నిర్ణయించుకుంది.
ఇదీ పద్మజ పంపిన మెసేజ్:
ఆత్మహత్యకు ముందు పద్మజ తన భర్త గిరీశ్ కు ఓ మెసేజ్ పెట్టింది. 'ఎండింగ్ మై లైఫ్. నాట్ హ్యాపీ విత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఐ యామ్ నాట్ లైవ్' అంటూ తన చివరి మాటలను వ్యక్తపరిచింది. మెసేజ్ చూసి ఇంటికి వచ్చిన గిరీశ్ కు భార్య ఉరేసుకుని ఉండటం కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు.
కాగా, పద్మజ చనిపోయే ముందు కూడా భర్తతో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. శని, ఆదివారం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. బనీన్ విషయంలో తెత్తిన గొడవ తారాస్థాయికి చేరి తీవ్ర ఘర్షణగా మారినట్లు చెబుతున్నారు.
పద్మజ శరీరంపై గాయాలు:
మృతురాలి నుదురు, మెడపై గాయాలు ఉండటంతో పద్మజ మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. పద్మజను భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టు మార్టమ్ రిపోర్టు వస్తేనే.. అసలు నిజాలు బయటపడుతాయని అంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భార్యభర్తల మధ్య గొడవ జరుగుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో పద్మజ మృతి ఏ ములపు తీసుకుంటుందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.