ఫీజు కట్టలేదని ప్యాంట్ ఊడదీసిన స్కూల్ యాజమాన్యం: విద్యార్థి ఆత్మహత్య
కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల తీరు పలువురు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి.
హైదరాబాద్: నగరంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల తీరు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. ఫీజు కట్టలేదని ఓ విద్యార్థిని పాఠశాల యాజమాన్యం ఘోరంగా అవమానించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఎన్డీటీవీ కథనం ప్రకారం.. మీర్జా సల్మాన్ అనే విద్యార్థి ఇఫమ్ ట్యాలెంట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఫీజు కట్టలేదనే నెపంతో సల్మాన్ను అతనికంటే చిన్నవారైన విద్యార్థుల ముందు ప్యాంట్ ఊడదీసి కూర్చోబెట్టిందని యాజమాన్యం. ఈ అవమానాన్ని తట్టుకోలేకే తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సల్మాన్ సోదరుడు తెలిపాడు.
ఈ ఘటన జరిగిన తర్వాత తాను తిరిగి ఈ పాఠశాలకు రానని సల్మాన్ కంటతడి పెడుతూ తన స్నేహితులకు చెప్పాడు. సున్నితమనస్కులైన పిల్లల పట్ల పాఠశాల యాజమాన్యాలు ఇలా ప్రవర్తించడంపై కుటుంబసభ్యులు, బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేశారు. కాగా, సల్మాన్ ఆత్మహత్యకు వ్యక్తిగత, కుటుంబ సమస్యలే కారణం కావొచ్చని పాఠశాల యాజమాన్యం చెప్పుకొచ్చింది. అతడ్ని తాము అవమానించలేదని చెప్పింది.
కాగా, ఫీజు చెల్లించే వరకూ స్కూల్ యాజమాన్యం తన సోదరుడ్ని అవమానాలకు గురిచేసిందని సల్మాన్ సోదరుడు చెప్పాడు. పెద్ద నోట్ల రద్దు కారణంగా తాము ఫీజు చెల్లించలేకపోయామని సల్మాన్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. సల్మాన్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.