ధూమ్ 2 తరహాలో.. నిజాం మ్యూజియంలో భారీ చోరీ: ఏం ఎత్తుకెళ్లారు, ఎలా ఎత్తుకెళ్లారంటే?
హైదరాబాద్: నగరంలోని పురానీ హవేలీలో గల నిజామ్ మ్యూజియం నుంచి ఆదివారం నాడు రాత్రి కొందరు దొంగలు విలువైన బంగారు వస్తువులను దొంగిలించారు. నిజాం కాలం నాటి సువర్ణ, వజ్ర ఖచిత పురాతన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఏకంగా మ్యూజియంలో దొంగతనం అందర్నీ నివ్వెరపరుస్తోంది.
దుండగులు పక్కా ప్లాన్తో సీసీ కెమెరాలలో పడకుండా దొంగతనానికి పాల్పడ్డారు. పురానీ హవేలి మస్రత్ మహల్లోని నిజాం మ్యూజియంలో ఈ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి మ్యూజియంలోకి చొరబడి పురాతన కళాఖండాలను అపహరించారు. సుమారు రెండు కిలోల బరువుతో వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, చెంచా, కప్పు సాసరును ఎత్తుకెళ్లారు.
మ్యూజియం మొదటి అంతస్తులో కడ్డీలు తొలగించి
దొంగతానికి గురైనవి పురాతన వస్తువులు. వీటి విలువ దాదాపు కోట్ల రూపాయలలో ఉంటుందని, అసలు వాటికి వెలకట్టలేమని చెబుతున్నారు. దొంగతనానికి గురైన బంగారు పాత్రల బరువు సుమారు మూడు కేజీల వరకు ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లో వాటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అంటున్నారు. దుండగులు మ్యూజియం మొదటి అంతస్తులోని వెంటిలేటర్ ఇనుప కడ్డీలను తొలగించి లోపలికి ప్రవేశించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 20 అడుగుల తాడు సహాయంతో లోపలికి దిగి చోరీ పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
లోపలకు వెళ్లి చూడగా కనిపించని వస్తువులు
ప్రతి రోజు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలు టిక్కెట్లు కొని మ్యూజియం సందర్శిస్తుంటారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మ్యూజియాన్ని మూసేసిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ షౌకత్ అలీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు తిరిగి తెరిచారు. లోపలికి వెళ్లి చూడగా విలువైన వస్తువులను భద్రపరిచిన అద్దాలు పగిలి ఉండటమే కాకుండా, గుర్తు తెలియని వ్యక్తులు మ్యూజియంలోకి చొరబడ్డట్లు గుర్తించారు. పైకప్పుకు అనుకొని ఉన్న వెంటిలెటర్ తొలగించి, అద్దాల్లో భద్రపరిచిన నవరత్నాలు పొదిగిన టిఫిన్ బాక్స్, బంగారు కప్పు, సాసర్, చెంచాలు కనిపించలేదు. మొత్తం నాలుగు గ్యాలరీల్లో విలువైన అభరణాలను సందర్శనం కోసం ఉంచారు. మూడో గ్యాలరీలో ఉన్న వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. దీంతో ఆయన ట్రస్టీ సభ్యులకు దొంగతనంపై సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాపై కాలు పెట్టారు
మ్యూజియం చుట్టూ ప్రహరీ 15మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ గోడను దూకే అవకాశాలు లేవు. భవనం చుట్టూ ఉన్న ఖాళీ ప్రాంతంలో ప్రయివేటు భవనాలు వెలియడం, వాటిలో నుంచి లోపలకు సులువుగా వచ్చేందుకు అవకాశాలు ఉండటంతో ఈ మార్గంలో దొంగలు వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దొంగలు సీసీ కెమెరాపై కాలు పెట్టడంతో అది విరిగిపోయింది. దొంగలు అందులోకి వచ్చినట్లు వాళ్ల కాళ్లు మాత్రమే సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు దొంగల సరైన అధారాలు లభ్యం కాలేదు. వచ్చింది ఎందరు అనే విషయం కూడా తెలియడం లేదు. ఇద్దరు వచ్చారా.. ముగ్గురు వచ్చారా తెలియాల్సి ఉంది. ఈ దొంగతనం ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువజాము మధ్య జరిగింది. ఆధారాలను బట్టి సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య జరిగిందనే ఆధారాలు కూడా దొరికాయని తెలుస్తోంది.
ఎవరైనా సమాచారం అందించారా
దొంగతనం జరిగిన సమయంలో మ్యూజియం వైపు వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. మూడు బైకుల పైన వ్యక్తులు వచ్చినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. నిందితులను పట్టుకుంటామని సీపీ అంజనీకుమార్ చెప్పారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. టాస్క్ ఫోర్స్, సౌత్ జోన్ పోలీసులతో 12 బృందాలను ఏఱ్పాటు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. సీపీ అంజనీ కుమార్ సోమవారం రెండు గంటల పాటు పరిస్థితిని అక్కడే ఉండి సమీక్షించారు. దొంగలు డబీల్ పురా, మలక్ పేట రైల్వే స్టేషన్ పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఘటనపై ఆలస్యంగా సమాచారం అందిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మ్యూజియానికి సంబంధించిన సమాచారం ఎవరైనా దుండగులకు అందించారా అనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు.
షిఫ్టుల్లో ఎనిమిది మందితో భద్రత
మ్యూజియం భద్రతను ఓ సంస్థకు చెందిన ఎనిమిది మంది భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. పగలు ముగ్గురు, రాత్రి అయిదుగురు కాపలాగా ఉంటారు. గ్యాలరీ వెంటిలేటర్ నుంచి తాడు వేలాడుతూ కనిపించింది. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఎతేషామ్, రజ్వీ, ఫరీద్, లియాకత్.. మ్యూజియం పరిపాలనాధికారి షౌకత్కు విషయాన్ని తెలిపారు. షౌకత్ విషయాన్ని మ్యూజియం పెవిలియన్ ట్రస్ట్ కార్యదర్శి రఫత్ హుస్సేన్కు చెప్పడంతో ఆయన సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాపై కాలు, మరో కెమెరా దిశ మార్పు
మ్యూజియం లోపల పది కెమెరాలున్నాయి. ఒక కెమెరాలో మాత్రం దుండగుడు తచ్చాడిన దృశ్యం నమోదైంది. అతడి వీపు మాత్రమే కనిపిస్తోంది. దీంతో స్పష్టత లేదు. ఇతనికి 25 నుంచి 30 మధ్య వయస్సు ఉంటుందని గుర్తించారు. దుండగులు సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మ్యూజియం సమీపంలో వెంటిలేటర్ను చిత్రీకరించేలా ఉన్న కెమెరా దిశను దుండగులు మార్చేశారు. వెంటిలేటర్ నుంచి లోపలికి దిగే క్రమంలో దుండగుడు సీసీ కెమెరా పైనే కాలు వేయడంతో అది ధ్వంసమైంది. ధూమ్ 2 సినిమాలో భారీ కోట.. సాయుధ బలగాల పహారా, మ్యూజియంలోకి అడుగు పెడితే అలారం మోగే.. పరిస్థితుల్లో తన స్నేహితురాలితో పైకప్పు వెంటిలెటర్ తొలగించి మ్యూజియంలోకి చొరబడి వజ్రాలు పొదిగిన కత్తిని హీరో ఎత్తుకెళ్తాడు. ఇప్పుడు నిజాం మ్యూజియంలోని దొంగతనం దాదాపు దానిని తలపిస్తోంది.