ఇంట్రెస్టింగ్: ట్రాఫిక్ పోలీసుల స్కీమ్ వర్కౌట్ అవుతోందిగా..వాహనదారులు కూడా ఫుల్ ఖుష్
హైదరాబాదు: కేంద్రం ఈ మధ్యే కొత్త మోటార్ వెహికల్ చట్టం తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొత్త చట్టం అమల్లోకి రాగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఆయా రాష్ట్రాల మోటార్ వెహికల్ చట్టాన్నే అమలు చేస్తున్నారు. ఇక కొత్త మోటార్ వెహికల్ చట్టంతో వాహనాదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో కొంతమంది వాహనంను రోడ్డుపైకి తీసుకురావడమే మానేశారు.
రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సూపర్
కేంద్రం తీసుకొచ్చిన మోటార్వెహికల్ చట్టంను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించారు. దీంతో తెలంగాణ వాహనాదారులకు భారీ ఊరటను కల్పించినట్లయ్యింది. అంతకంటే మరింత ఊరటనిస్తున్నారు హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు పై కనిపిస్తే చాలు బైకుపై వెళ్లే వాహనదారుడు మరో దారి వెతుక్కుంటాడు. జరిమానాతో పోలీసులు జేబులకు చిల్లుపడేలా చేస్తారనే భయంతో వాహనదారుడు ఇతర మార్గాల కోసం వెతుకుతాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఫ్రెండ్లీ ట్రాఫిక్ పోలీసింగ్కు దిగారు రాచకొండ కమిషనరేట్లోని ట్రాఫిక్ పోలీసులు.
ఆన్ ది స్పాట్ లైసెన్సులకు స్లాట్ బుకింగ్
ఒకవేళ బైకు నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించకుండా రోడ్డుపై వస్తూ ట్రాఫిక్ పోలీసుల కంట పడితే అతన్ని పిలిపించి అతనితోనే ఆన్ ది స్పాట్ హెల్మెట్ కొనుగోలు చేయిస్తున్నారు పోలీసులు. అదే వాహనంకు ఇన్ష్యూరెన్స్ లేకపోతే అక్కడే చేయిస్తున్నారు. పొల్యూషన్ చెక్ లేకపోతే వెంటనే చేయిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు ముందే చేసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకవేళ వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండకపోతే అక్కడే ట్యాబ్ నుంచి ఆన్లైన్ ద్వారా లైసెన్సు పొందేందుకు స్లాట్ బుక్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
ఒకప్పుడు భారీ జరిమానాలు విధించే పోలీసులు ఇలా అన్నీ దగ్గరుండి చూసుకోవడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులను చూస్తే భారీ జరిమానాలకు భయపడి వేరే దారిలో వెళ్లిపోయేవాళ్లమని ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని చెబుతున్నారు. జరిమానా కట్టే బదులు ఆ డబ్బుతో హెల్మెట్లను కొనిస్తున్నారని అది తమకే మంచిదని చెబుతున్నారు వాహనదారులు. ఇక లైసెన్స్ లేకపోతే ఆన్లైన్ స్లాట్ బుక్ చేస్తున్నారని, ట్రాఫిక్ పోలీసులు నిజంగానే ఫ్రెండ్లీ పోలీసులుగా మారారని హర్షం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు.
భారీ జరిమానాలు విధించడాన్ని తప్పుబట్టిన కేసీఆర్
మొత్తానికి కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికల్ చట్టం తెలంగాణలో అమలు చేయడం లేదని కేసీఆర్ చెప్పారు. ఇలాంటి భారీ జరిమానాలు విధించి తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టలేమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అంత భారీ జరిమానాలు విధిస్తే వారి రక్తాన్ని పీల్చినట్లవుతుందని కేసీఆర్ అన్నారు. అందుకే కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.