సినీ ప్రముఖులను మోసం చేశారని ప్రసారం: టీవీ ఛానల్ సీఈవో అరెస్ట్
హైదరాబాద్: ముగ్గురు సినీ ప్రముఖులను మోసం చేసినట్లు ప్రసారాల్లో చూపారనే ఆరోపణల కింద వాట్సాప్ టీవీ ఛానల్ సీఈవోను పోలీసులు అరెస్టు చేశారు. సదరు టీవీ ఛానల్ పైన బాధితుల ఫిర్యాదు చేశారు. దీంతో సీఈవోను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఖైరతాబాద్లో నిర్వహిస్తున్న వాట్సాప్ ఛానెల్ తమ కుటుంబం పరువు తీస్తూ తప్పుడు ప్రసారాలు చేసిందని నూర్ఖాన్ బజార్కు చెందిన వ్యాపారి హమీద్ సాబేరి ఈ నెల పదమూడవ తేదీన ఫిర్యాదు చేశారు. రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఛానెల్ సీఈఓ షాహిద్ ఖురేషిని అరెస్టు చేశారు.
బాధితులు సాబేరీ సోదరులు. బాధితులు తమ ఫిర్యాదులో... నిందితుడు ఖురేషీ తన వాట్సాప్ టీవీ ఛానల్లో తమ గురించి వ్యతిరేకంగా ఏడు ఎపిసోడ్లు ప్రసారం చేశాడని తెలిపారు. తమను దొంగలుగా, క్రిమినల్స్గా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీవీ ప్రసారాల్లో తమ పైన తీవ్ర ఆరోపణలు చేశారని తెలిపారు. తాము బాలీవుడ్ ప్రముఖులు సంజయ్ దత్, సల్మాన్ ఖాన్లను కూడా చీట్ చేసినట్లు ప్రసారం చేశాడని తెలిపారు.
కాగా, గతంలో సదరు టీవీ ఛానల్ సీఈవో షాహిద్ ఖురేషీ సోదరుడు కాషీఫ్ ఖురేషీకి సాబేరీ సోదరులకు మధ్య ఘర్షణ జరిగింది. సోదరుడితో గొడవ కారణంగానే తమకు వ్యతిరేకంగా ప్రసారం చేసి ఉంటారని భావిస్తున్నారు.
సాబేరీ సోదరులు సాబేరీ ఆప్టికల్స్ నడుపుతుంటారు. వారు వాట్సాప్ టీవీ ఛానల్ పైన రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
పోలీసులు మాట్లాడుతూ.. తాము నిందితుడు ఖురేషీని అరెస్టు చేశామని, కోర్టులో ప్రవేశ పెట్టామని చెప్పారు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు.
ఫిర్యాదు చేసిన సాబేరీ సోదరుల్లో ఒకరైన హమీద్ సాబేరీ మాట్లాడుతూ... నిందితుడు తమ పైన టీవీలో ప్రసారం ఏడు ఎపిసోడ్లు తమ కుటుంబాన్ని బాధించాయని చెప్పారు. అతని పైన పరువు నష్టం దావా వేశామని చెప్పారు.
మరో సోదరుడు హస్నేనీ సాబేరీ మాట్లాడుతూ... ఆ ఎపిసోడ్లు ప్రసారం చేయడానికి ముందు నిందితుడు తమ నుంచి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడని చెప్పారు. తాము నిరాకరించడంతో ప్రసారం చేశాడని, దానిని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేశాడని చెప్పారు.
తమ పైన ఇప్పటి వరకు ఒక్క ఎకనామిక్ అఫెన్స్ కేసు కూడా లేదని సాబేరీ సోదరులు చెప్పారు. కానీ వాట్సాప్ ఛానల్ ద్వారా తమను వైట్ కాలర్ క్రిమినల్గా పేర్కొన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, షాహిద్ ఖురేషీ కొద్ది నెలల క్రితమే వాట్సాప్ ఛానల్ పేరుతో కొత్త టీవీ ఛానల్ ప్రారంభించాడు. తన టీవీ ఛానల్లో ఇతనే యాంకరింగ్ చేసేవాడు.