ఫేస్బుక్లో ‘సారీ’ చెప్పి.. టీవీ ఛానల్ ఎడిటర్ ఆత్మహత్య
ఓ టీవీ ఛానల్లో ఎడిటర్గా పని చేస్తున్న ఓ ఉద్యోగి ఫేస్బుక్లో ముందుగానే సమాచారమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: ఓ టీవీ ఛానల్లో ఎడిటర్గా పని చేస్తున్న ఓ ఉద్యోగి ఫేస్బుక్లో ముందుగానే సమాచారమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నగరంలోని మోతీనగర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆర్ రాజేష్ చౌదరి(32) అనే వ్యక్తి జీ టీవీ తెలుగు ఛానల్లో డెస్క్ ఎడిటర్గా పని చేస్తున్నాడు. ఖమ్మంలోని జానకీపురంకు చెందిన రాజేష్.. నగరంలోని మోతీనగర్లో నివాసముంటున్నాడు. కాగా, రాజేష్ తల్లి, సోదరుడు అతని చిన్నతనంలోనే చనిపోయారు. అతని సొంత గ్రామంలో తండ్రి ఉంటున్నాడు.
ఈ క్రమంలో రాజేష్ తను ఒంటరివాడినయ్యానంటూ తనలో తాను బాధపడుతుండేవాడు. కాగా, రాజేష్ ఆత్మహత్య చేసుకునే ముందు ఫేస్బుక్లో రెండు పోస్టులు పెట్టాడు. 'మీ అందర్నీ మిస్ అవుతున్నా.. నన్ను క్షమించాలి' అని పోస్ట్ చేశాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తెలిపాడు.
తాను ఒంటరిగా ఉన్నాననే భావన తనను వేధిస్తోందని, అందుకే తన తల్లి దగ్గరికి వెళ్తున్నట్లు తెలిపాడు. తాను పుట్టేటప్పుడు ఒక్కడినే జన్మించలేదని, తనతోపాటు తన చావు కూడా పుట్టిందని ఫేస్బుక్లో వ్యాఖ్యానించాడు రాజేష్. ఆ తర్వాత తన గదిలోనే సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, ఫేస్బుక్లో రాజేష్ పోస్ట్ చూసిన అతని స్నేహితులు.. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. అతనుండే నివాసానికి చేరుకుని, ఇంటి యజమాని, చుట్టుపక్కల వారికి విషయం తెలిపారు. అతని గదికి వెళ్లి చూడగా అప్పటికే రాజేష్ విగత జీవిగా పడివున్నాడు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది.
రాజేష్ ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడుతుండేవాడని, అతడికి ఇంకా పెళ్లి కాలేదని స్నేహితులు తెలిపారు. రాజేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అతని తండ్రికి అప్పగించారు.