జంట పేలుళ్లు: మరో నిందితుడు తారిఖ్ అంజుమ్ను దోషిగా తేల్చిన కోర్టు
హైదరాబాద్: జంట పేలుళ్ల కేసులో ఇప్పటికే ఇద్దరిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. మరొకరిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో సోమవారం తుది విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మహ్మద్ తారిఖ్ అంజుమ్ను దోషిగా తేల్చింది.
హైద్రాబాద్ జంటపేలుళ్లు: ఇద్దరిని దోషులుగా తేల్చిన కోర్టు, మరో ఇద్దరిపై ఆధారాల్లేవని...
2007 ఆగస్టు 25న హైదరాబాద్లోని గోకుల్ఛాట్, లుంబినీపార్కుల వద్ద జరిగిన జంట పేలుళ్లలో 44 మంది అమాయకులు మరణించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పోలీసు శాఖలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం కేసు దర్యాప్తు చేసి అభియోగపత్రాలు దాఖలు చేసింది.
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లిలోని రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మంగళవారం తీర్పు ప్రకటించారు. బాంబులు పెట్టిన అనీక్ షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి నేరం చేసినట్లు న్యాయస్థానం తేల్చింది. మరో ఇద్దరు నిందితులైన సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫుద్దీన్ తర్ఖాష్లను నిర్దోషులుగా పేర్కొంది.
మరో నిందితుడు మహ్మద్ తారీఖ్ అంజూమ్ ఎహసాస్ను దోషిగా తేలుస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ ముగ్గురికి ఈరోజు శిక్షలు ఖరారు చేయనుంది. ఈ కేసులో మిగతా ముగ్గురు నిందితులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీర్ రెజాఖాన్లు పరారీలో ఉన్నారు.