బెంబేలెత్తించిన ఉబెర్, ఓలా క్యాబ్లు: వనస్థలిపురం -హైటెక్ సిటీకి రూ.3,566 వసూలు
హైదరాబాద్: ఓ వైపు బుధవారం కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేస్తే.. మరో వైపు క్యాబ్ సంస్థలు ప్రయాణికులపై అత్యధిక రేట్లు వసూలు చేసి తమ ప్రతాపాన్ని చూపించేశాయి. ఎన్నడూ, ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయిలో చార్జీలు వసూలు చేసి జేబులు గుల్ల చేసింది ఉబర్ క్యాబ్. సందీప్ కుమార్ అనే వ్యక్తి బుధవారం ఉదయం వనస్థలిపురం నుంచి హైటెక్ సిటీలోని రహేజా మైండ్ స్పేస్కు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు.
అయితే, గమ్యస్థానం చేరాక రూ.3,566 ఫేర్ చూసి ఖంగుతిన్నాడు. ఉబర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. 'వనస్థలిపురం నుంచి హైటెక్ సిటీకి అత్యంత చీప్ రేట్ ఇదే' అని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ అనుభవం ఒక్క సందీప్కే ఎదురవలేదు. మరెందరో 'ఉబెర్' బాధితులు ఉన్నారు.
రోహిత్ అక్షయ్ అనే మరో ఉద్యోగి సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి నానక్రామ్గూడకు ట్యాక్సీ బుక్ చేసుకుని రూ.1,518 చెల్లించుకున్నాడు. సాధారణ రోజుల్లో ఈ ఫేర్ రూ.387. మరో ఐటీ ఉద్యోగిని ప్రత్యూష మెహదీపట్నం నుంచి గచ్చిబౌలికి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు.
అయితే రూ.730 చార్జీ చూపించడంతో వెంటనే రద్దు చేసుకున్నారు. మామూలు రోజుల్లో ఈ ఫేర్ రూ.160. బుధవారం నగరవాసులు ఎదుర్కొన్న అనుభవాల్లో ఇవి కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. మరెందరో వారి ప్రతాపానికి బెంబేలెత్తిపోయారు.
వర్షాన్ని సాకుగా చూపి ఉబర్, ఓలా క్యాబ్స్ బుధవారం ప్రయాణికులను నిలువునా ముంచేశాయని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సాధారణ ధరకంటే నాలుగైదు రెట్లు, అంతకంటే ఎక్కువ వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలాఖరు కావడం, జేబుల్లో పైసా లేకపోవడంతో ట్యాక్సీ ఫేర్లతో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వంలా ధరల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు.
క్యాబ్ ప్రయాణికుల పాట్లపై స్పందించిన రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓలా, ఉబర్ సర్వీసుల్లా యాప్ ద్వారా ప్రభుత్వం నుంచి వీటి కంటే ఉత్తమ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.