2002లో కూడా 12 మంది దళిత విద్యార్ధులను సస్పెండ్ చేసిన వీసీ అప్పారావు
హైదరాబాద్: పీహెచ్డీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యతో హెచ్సీయూ వైస్ ఛాన్సలర్ పొదిలె అప్పారావు గతంలో తీసుకున్న నిర్ణయాలు సైతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వీసీ అప్పారావు ఏబీవీపీ, అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ నేతల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములతో పాటు మరో నలుగురు విద్యార్ధులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా దళిత విద్యార్థులను సస్పెండ్ చేయడంలో వీసీ అప్పారావు సిద్ధహస్తుడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్, అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ నేత కృష్ణా నాయక్ ను ఊటంకిస్తూ ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ కథనాన్ని ప్రచురించింది.
ఆ కథనానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2001 నుంచి 2004 వరకు అప్పారావు వర్సిటీలోని హాస్టల్కు చీఫ్ వార్డెన్గా పనిచేశారు. ఆ సమయంలో హాస్టల్ విద్యార్థులను మాంసాహారులు, శాకాహారులుగా అప్పారావు విభజించారు. ఈ విభజన ద్వారా దళితులు, దళితేతరులు అన్న భావనను విద్యార్థుల మధ్య తీసుకొచ్చారు.
దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన దళిత విద్యార్ధులు 2002లో ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులపై అప్పారావు దురుసుగా ప్రవర్తించారు. అంతేకాదు ఓ విద్యార్ధి కాలర్ కూడా పట్టుకుని చేయి చేసుకోబోయే వరకు వెళ్లారు. ఈ క్రమంలో అప్పారావుకు మద్దతుగా కొంత మంది విద్యార్ధులు, దళిత విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఒక వార్డెన్కు, మరో దళిత టీచర్కు గాయాయ్యాయి. దీనిపై విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అప్పట్లో ఒక కమిటీని కూడా వేసినట్లు ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ క్రమంలో అప్పారావు 12 మంది దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీనిపై విద్యార్థులు కోర్టుకెళ్లగా, వారి పిటిషన్ను అప్పట్లో కోర్టు కొట్టేసింది.
ఇది ఇలా ఉంటే బుధవారం వీసీ అప్పారావు మాట్లాడుతూ రోహిత్ తో బాటు, మరో నలుగురిని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్న విషయమై వివరణ ఇచ్చారు. రోహిత్ తో బాటు, మరో నలుగురిని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్న విషయమై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కాగా రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళనలు సైతం కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ లేఖతో పాటు వీసీ అప్పారావు తీసుకున్న నిర్ణయమే రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైందని విద్యార్ధులు, పలు విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపిస్తూ, తక్షణమే ఆయనను వీసీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.