హైదరాబాద్లో దారుణం... అత్తపై విచక్షణారహితంగా దాడి చేసిన కోడలు...
హైదరాబాద్లోని మల్లేపల్లిలో దారుణం వెలుగు చూసింది. అత్తపై ఓ కోడలు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సదరు మహిళపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్లోని మల్లేపల్లికి చెందిన ఉబైద్ అలీ ఖాన్ తల్లి తషనిమా సుల్తానా, తండ్రి అహ్మద్ సాహిద్ ఖాన్తో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. వృత్తిరీత్యా సౌదీలో ఉంటున్న ఉబైద్ అలీ మొదటి భార్య ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో ఉజ్మా బేగం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన నెల రోజులు భార్యతో ఉన్న ఉబైద్... వృత్తి రీత్యా తిరిగి సౌదీ వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఉజ్మా అత్త,మామలతో కలిసి మల్లేపల్లిలోనే ఉంటోంది. ఈ క్రమంలో అత్తాకోడళ్లకు తరుచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. అత్త తషనిమా సుల్తానాను కోడలు ఉజ్మా వేధింపులకు గురిచేస్తోంది.
ఇదే క్రమంలో ఇటీవల హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అత్త తనపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఉజ్మా బేగం ఆమెను ఇంటి నుంచి గెంటేసేందుకు ప్రయత్నించింది. ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రోడ్డు మీదకు లాక్కొచ్చింది. కింద పడేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఉజ్మా బేగంకు ఆమె తల్లి కూడా తోడై ఇద్దరూ కలిసి దాడి చేశారు. ఇవన్నీ రోడ్డుపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న మల్లేపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనపై తషినిమా మాట్లాడుతూ.. గతంలోనూ చాలాసార్లు తన కోడలు తనపై దాడికి పాల్పడిందన్నారు. తన కొడుకు సౌదీలో పనిచేస్తున్నాడని... 2018లో సౌదీ నుంచే ఉజ్మాబేగంను ఫోన్ ద్వారా వివాహం చేసుకున్నాడని చెప్పారు. ఆ తర్వాత ఒకసారి వచ్చి నెల రోజులు ఉండి వెళ్లిపోయినట్లు తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్నోసార్లు ఉజ్మా తనపై దాడికి పాల్పడిందన్నారు.
దాడిపై పోలీసులు మాట్లాడుతూ... అత్తా కోడళ్లు ఒకే బిల్డింగ్లో వేర్వేరు పోర్షన్లలో ఉంటున్నట్లు చెప్పారు. గురువారం(అక్టోబర్ 8) ఉజ్మా బేగం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో అత్త తనిషిమా ఆమె పోర్షన్కు వాటర్,ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసిందన్నారు. ఉజ్మా ఇంటికి తిరిగొచ్చాక... ఈ విషయంపై అత్తతో గొడవపడి ఆమెపై దాడి చేసిందన్నారు.