ఒకే కాన్పులో నలుగురు శిశువులు
హైదరాబాద్ : ఒకే కాన్పులో కవలలు పుట్టడం సహజం. అయితే నలుగురు కవలలు పుట్టిన అరుదైన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. చిలకలగూడలోని గీతా నర్సింగ్ హోంలో హేమలత అనే మహిళ ఒకేకాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. శిశువుల్లో ఇద్దరు అబ్బాయిలు కాగా.. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈ నెల 2వ తేదీన డెలివరీ అయినా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిలకలగూడకు చెందిన హేమలతకు నెలలు నిండకముందే పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో ఆమె భర్త లక్ష్మణ్ దగ్గరలోని గీతా నర్సింగ్ హోంకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి నలుగురు శిశువులను డెలివరీ చేశారు. పిల్లల బరువు తక్కువగా ఉండటంతో వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. దీంతో చిన్నారులను విద్యానగర్లోని నియో బీబీసీ హాస్పిటల్కు తరలించారు. పుట్టినప్పుడు కేవలం కిలో బరువున్న శిశువులకు ఆత్యాధునిక చికిత్స అందించడంతో వారి పరిస్థితి మెరుగైంది. ప్రస్తుతం శిశువుల బరువు కిలోన్నర వరకు చేరింది. ప్రస్తుతం శిశువుల ఆరోగ్య పరిస్థితి బాగుందని డాక్టర్లు చెప్పారు.