బాయ్ఫ్రెండ్తో వాట్సాప్ చాట్ చేస్తుండగా.. ఊహించని ఘటన.. యువతి మృతి
సెల్ఫోన్లో తలదూర్చారంటే చాలామంది బయటి ప్రపంచాన్ని మర్చిపోతారు. కొంతమంది చాటింగ్లో మునిగిపోయి.. ఎదురుగా ఏం వస్తుందో.. అసలు ఎటువైపు వెళ్తున్నామో కూడా గమనించరు. అంతలా సెల్ఫోన్ ప్రపంచంలో విహరిస్తుంటారు. కానీ ఇలాంటి అలవాట్లు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తాయి. ఏమరపాటుగా ఉంటే.. నిండు జీవితం క్షణాల్లో గాల్లో కలిసిపోతుంది. ఇదే తరహాలో తాజాగా ఓ యువతి మృతి చెందిన ఘటన హైదరాబాద్ శివారులోని శంషాబాద్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ముధోల్ టౌన్ బాగల్కోట్ జిల్లాకు చెందిన సిమ్రాన్(22) అనే యువతి శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమర్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తోంది. విమానశ్రయానికి దగ్గరలోనే ఓ హాస్టల్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో సిమ్రాన్.. ఉన్నట్టుండి హాస్టల్ మూడో ఫ్లోర్ నుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సెల్ఫోన్లో బాయ్ఫ్రెండ్తో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోవడం వల్లే ఆమె చనిపోయినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొద్దిరోజులుగా ఆమె డిప్రెషన్లో ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించామని,ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సిమ్రాన్ మృతిపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు చెప్పారు.
కాగా,డ్రైవింగ్ చేస్తూ టిక్టాక్ వీడియోలు చూడటం,వాట్సాప్ చాటింగ్ చేసి ప్రమాదాలను కొని తెచ్చుకున్న ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఇక సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా అనేకం. ఇంత జరుగుతున్నా.. యువతలో మాత్రం మార్పు రావడం లేదు. సెల్ఫోనే స్వర్వస్వం అయిన నేటి తరుణంలో.. దాన్ని వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో,అనర్థాలు కూడా అన్నే చోటు చేసుకున్నాయి. కాబట్టి సెల్ఫోన్ వాడకం విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఇలాంటి ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చు.