సోమాలియాలో నరకం చూస్తున్న నా సోదరిని కాపాడండి: సుష్మాకు హైదరాబాదీ వేడుకోలు
హైదరాబాద్: సోమాలియాలో నరకం అనుభవిస్తోన్న తన సోదరిని కాపాడాలని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను వేడుకున్నారు. తన సోదరి మొహమ్మదీ బేగమ్కు, ఆమె పిల్లలకు కనీసం తిండి కూడా పెట్టకుండా అత్తింటివారు వేధిస్తున్నారని సోదరుడు మొహమ్మద్ వహియుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
'నా సోదరికి 2003లో సోమాలియా జాతీయుడైన సయ్యద్ హసన్ ఇబ్రహీంతో వివాహం జరిగింది. వారు అప్పటి నుంచి 2013 వరకు హైదరాబాద్లో మాతో పాటే ఉండేవారు. వారికి ఐదుగురు పిల్లలు జన్మించారు. 2013లో సోమాలియాలో ఉన్న తన తల్లిదండ్రులు పిల్లలను చూడాలంటున్నారని సయ్యద్ చెప్పడంతో నా సోదరి, పిల్లలతో సహా అక్కడికి వెళ్లింది. సయ్యద్ మాత్రం ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఉండి, ఆ తరవాత అమెరికా వెళ్లిపోయాడు. నా సోదరి,ఆమె పిల్లలు సోమాలియాలోనే ఉండిపోయారు' అని వహియుద్దీన్ తెలిపారు.
ఆ తర్వాత 'సయ్యద్ కుటుంబ సభ్యులు నా సోదరికి, ఆమె పిల్లలకు కనీసం తిండి కూడా పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారు' అని వహియుద్దీన్ మీడియా ఎదుట వాపోయాడు. వెంటనే వారిని కాపాడాలని విదేశాంగమంత్రిని అభ్యర్థించాడు. ఎటువంటి ఆలస్యం చేయకుండా తన సోదరిని, ఆమె పిల్లలను భారత్ తీసుకురావాలని వేడుకున్నారు.