యువకుడ్ని కిడ్నాప్ చేసిన లేడీ సాఫ్టువేర్ ఇంజనీర్, ఆమె స్నేహితుల అరెస్ట్
హైదరాబాద్: గత మూడు నాలుగు నెలలుగా తనను వేధిస్తున్న యువకుడిని ఓ లేడీ టెక్కీ తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి, అతనిని కొట్టించిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేశారు. అదే రోజు యువతిని అరెస్టు చేశారు. అనంతరం ఆమెకు సహకరించిన స్నేహితులను కూడా అరెస్టు చేశారు.
లేడీ టెక్కీకి ఫోన్లో వేధింపులు
23 ఏళ్ల కార్పెంటర్ సాయి కుమార్ కొద్ది రోజుల క్రితం ఈ లేడీ టెక్కీని చూశాడు. అప్పటి నుంచి ఆమెను ఫోన్లో వేధిస్తున్నాడు. నాకు కలవాలని ఉందని, ఓసారి కలుద్దామని ఆమెకు పదేపదే ఫోన్లు చేసేవాడు. అతను ఫోన్ చేస్తుండటంతో సదరు లేడీ టెక్కి విసిగిపోయింది. దీంతో అతనికి ఎలాగైనా బుద్ది చెప్పాలని ప్లాన్ వేసింది.
టెక్కీ, ఐదుగురు స్నేహితుల అరెస్ట్
తన ఐదుగురు స్నేహితులతో సికింద్రాబాద్ ప్రాంతంలో కిడ్నాప్ చేసి, గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అతనిని కొట్టించింది. అతను వారి నుంచి ఎలాగోలా తప్పించుకొని వచ్చాడు. తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ లేడీ టెక్కిని అదే రోజు అరెస్టు చేశారు. ఆమెను విచారించి మిగతా స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
బైక్ పైన ఎత్తుకెళ్లారు
సదరు లేడీ టెక్కీ ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తోంది. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ... గత కొద్ది రోజులుగా సాయి ఆమెను వేధిస్తున్నాడని, దీంతో అతనికి బుద్ధి చెప్పేందుకు కిడ్నాప్ చేశారని చెప్పారు. లేడీ టెక్కీ, ఆమె స్నేహితులు.. సాయిని బైక్ పైన ఎత్తుకెళ్లారని, గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారన్నారు. కర్రలతో కొట్టారని చెప్పారు.