అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
చికాగో/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్ వాసి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. రామాంతపూర్లోని శాంతినగర్లో నివాసం ఉంటున్న విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి అంబారిపేట రాంప్రసాద్ కుమారుడు కృష్ణప్రసాద్ ఉద్యోగం కోసం ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లారు.
చికాగోలో నివాసం ఉంటూ విటెన్ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. కాగా, కృష్ణప్రసాద్ మృతిచెందిన విషయాన్ని శుక్రవారం ఉదయం చికాగో పోలీసులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు మృతుడి తండ్రి రాంప్రసాద్ తెలిపారు.
కృష్ణప్రసాద్ నివాసం ఉంటున్న గది తలుపులు ఎంతకూ తెరవకపోవడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి తలుపు పగలుగొట్టి అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించినట్లు అక్కడి పోలీసులు తెలిపారన్నారు.
అమెరికాలోనే ఉంటున్న రాంప్రసాద్ మరో కుమారుడు హరిప్రసాద్కు కృష్ణప్రసాద్ మృతదేహం అప్పగించనున్నారన్నారు. కృష్ణప్రసాద్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ ప్రసాద్కు భార్య మైథిలి, కుమార్తె సాహితి 6) కుమారుడు అర్జున్ (4) ఉన్నారు.