రంగురంగుల పతంగులు... 'కైట్ ఫెస్టివల్' ధూంధాం..!
పండుగలంటే పల్లెల్లోనే జరుగుతాయా? నగరాల్లో జరగవా? ఇది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. కానీ సంక్రాంతి పండుగకు పల్లెలతో పోటీపడుతోంది హైదరాబాద్ మహానగరం. సంకాంత్రికి చాలామంది గ్రామాలబాట పట్టడంతో భాగ్యనగరం రోడ్లు బోసిపోయి కనిపిస్తాయి. కానీ నెక్లెస్ రోడ్డు, పరేడ్ గ్రౌండ్స్ కు వెళితే.. జనాలందరూ అక్కడే కనిపిస్తారు.
చిన్నప్పుడు గాల్లోకి పతంగులు ఎగురవేయడం అందరికీ అనుభవమే. ఏదో ముగ్గురు నలుగురు కలిసి సరాదాగా పతంగులు ఎగురవేస్తుంటారు. హైదరాబాద్ లో మాత్రం పతంగులు ఎగురవేయడం పెద్ద పండుగే. కైట్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించే పతంగుల ఆట ధూంధాం గా జరుగుతుంటుంది. పెద్దసంఖ్యలో జనాలు నెక్లెస్ రోడ్డు, పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. అంతేకాదు సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా కైట్ ప్లేయర్స్ హైదరాబాద్ కు వస్తుంటారు.
రంగురంగుల పతంగులు.. సీతాకోకచిలుకలే..!
సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, పిండివంటలే కాదు పతంగులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎన్నడూ పతంగులు ముట్టనివారు సైతం ఈ పండుగవేళ కైట్ ఎగురవేస్తారంటే అతిశయోక్తి కాదు. పతంగులు ఎగురవేయడం రాకున్నా.. సరదాగా వాటితో కుస్తీ పడుతుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఉల్లాసంగా పతంగులు ఎగురవేస్తుంటారు. హైదరాబాద్ లో పతంగుల సందడి అంతా ఇంతా కాదు. రెండు మూడు రోజుల పాటు డీజే సౌండ్స్ పెట్టుకుని మేడలపైన కైట్స్ ఎగురవేస్తూ కేరింతలు కొడుతుంటుంది యువత. ఏ గల్లీలో చూసినా, ఏ బస్తీలో చూసినా పతంగుల సంబురం అంతా ఇంతా కాదు.
ఏర్పాట్లు ఘనం.. మూడు రోజులు సందడే
హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ ప్రతియేటా ఘనంగా జరుగుతుంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టూరిజం, సాంస్కృతిక శాఖలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాయి. గత నాలుగేళ్లుగా సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఆక్రమంలో ఈసారి కూడా 13,14,15 తేదీల్లో సంక్రాంతి సంబురాలు వైభవంగా నిర్వహించేలా ప్లాన్ చేశాయి. అందులోభాగంగా 13వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఈ మూడు రోజుల్లో పెద్దసంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశముండటంతో ఆదిశగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
నోరూరించే వంటకాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు
హైదరాబాద్ లో జరగనున్న కైట్ ఫెస్టివల్ కు ప్రపంచం నలుమూలల నుంచి కైట్ ప్లేయర్స్ రానున్నారు. దాదాపు 30 దేశాలకు చెందిన 100 మంది పతంగుల పండుగలో భాగస్వామ్యం కానున్నారు. ఈనేపథ్యంలో నెక్లెస్ రోడ్డుతో పాటు పరేడ్ గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్ రంగురంగుల పతంగులతో కొత్త శోభ సంతరించుకోనున్నాయి. ఇక తెలంగాణ వంటకాలు నోరూరించనున్నాయి. వివిధ రకాల స్వీట్లతో పాటు పలురకాల వంటకాలకు సంబంధించిన స్టాల్స్ పెడుతుండటం విశేషం. అంతేకాదు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించనున్నాయి. తెలంగాణ కళలతో పాటు కథక్, అస్సామీ, ఒడిస్సీ, బిహు, బెంగాళీ, కశ్మీరీ లాంటి తదితర ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి.