నేను తెలంగాణ చిన్నమ్మను: జీఈఎస్లో సుష్మా స్వరాజ్, చప్పట్లే చప్పట్లు...
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తనను తాను తెలంగాణ చిన్నమ్మగా చెప్పుకున్నారు. ఆమె ఆ మాట అనగానే సభ చప్పట్లతో మార్మోగింది.
హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తనను తాను తెలంగాణ చిన్నమ్మగా చెప్పుకున్నారు. ఆమె ఆ మాట అనగానే సభ చప్పట్లతో మార్మోగింది.
మంగళవారం హైటెక్స్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ఆఖర్న ఆమె ప్రసంగించారు. సదస్సును దిగ్విజయంగా నిర్వహిస్తోన్నందుకు నీతి ఆయోగ్కు, తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్ స్ఫూర్తి కేంద్రంగా మారిందని చెప్పారు. ప్రస్తుత ఈ సదస్సు సంప్రదాయ, ఆధునికతల సమ్మేళనమనే విషయాన్ని తెలంగాణ చిన్నమ్మగా తాను చెప్పగలనన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్- అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయనడంలో తనకెలాంటి సందేహంలేదని సుష్మా తెలిపారు. ఈ ప్రఖ్యాత సదస్సుకు అతిథిగా విచ్చేసిన ఇవాంకాకు ధన్యవాదాలు అన్నారు.
నేటి యువత శక్తియుక్తులకు ఇవాంకా ట్రంప్ను ఓ ప్రతినిధిగా సుష్మా స్వరాజ్ అభివర్ణించారు. ఇవాంక నుంచి భారత్, ప్రపంచ మహిళా పారిశ్రామికవేత్తలు ప్రేరణ పొందుతారని అన్నారు.