నేనే సీఎం, ఇంకేం మాట్లాడొద్దు: పార్టీ నేతలకు కేసీఆర్ వార్నింగ్, ‘కేటీఆర్ సీఎం’ ప్రచారానికి తెర
హైదరాబాద్: త్వరలోనే మంత్రి కేటీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి అవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 412 మంది ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి కేసీఆర్ పూలమాలవేసి నివాళులర్పించారు.
Recommended Video
పదేళ్లు నేనే ముఖ్యమంత్రినంటూ కేసీఆర్..
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, పార్టీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. ఎందుకలా? మాట్లాడుతున్నారంటూ సీఎం మార్పుపై వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై మండిపడ్డారు. తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని కేసీఆర్ చెప్పారు. పదేళ్లు సీఎంగా ఉంటానని అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్లు గుర్తు చేశారు.
సీఎం మార్పుపై మాట్లాడొద్దన్న కేసీఆర్..
ఒకవేళ ఆరోగ్యం సహకరించని రోజు తానే చెబుతానని పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పారు. అప్పుడు ఎవర్ని సీఎం చేయాలన్నదానిపై మిమ్మల్నే(పార్టీ నేతలను) అడుగుతానని అన్నారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పిన కేసీఆర్.. ఇకపై సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడకూడదంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాలో వస్తున్న వార్తలను కూడా ప్రస్తావించారు. మంత్రి కత్తి పద్మారావు, బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా ఇటీవల కేటీఆర్ సీఎం అవుతారంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు సీల్డ్ కవర్లలోనే..
ఇక ఏప్రిల్ నెలలో టీఆర్ఎస్ బహిరంగ సభ ప్లీనరీ ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఫిబ్రవరి 12 నుంచి పార్టీ సభ్య నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఎమ్మెల్యే 50వేల సభ్యత్వం నమోదు చేయించాలని ఆదేశించారు. మార్చి నుంచి పార్టీ కమిటీల నియామకం జరుగుతుందన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు సీల్డ్ కవర్లలో అందించడం జరుగుతుందన్నారు.
11న మేయర్ ఎన్నికలకు తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెలందరూ కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీకి వెళ్లాలని, సీల్డ్ కవర్లలో మేయర్, డిప్యటీ మేయర్ అభ్యర్థుల పేర్లు ఉంటాయన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే కవర్ ఓపెన్ అవుతుందన్నారు.