అనేక అవమానాలు, కేసీఆర్ది రాచరిక ఫ్యూడల్ మనస్తత్వం: ఈటల రాజేందర్ సవాల్, బీజేపీలో హ్యాపీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీలో చేరిన అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశానని, ప్రజలకు ఉద్యమంలో తన పాత్ర ఎంటో తెలుసని వ్యాఖ్యానించారు.
అనేక అవమానాలు..
రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని భావించామన్నారు. మేధావుల సూచనలు తీసుకుంటామని మొదట్లో చెప్పిన కేసీఆర్.. అనేక మంది మేధావులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఈటల ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో అనేక అవమానాలు భరించామని తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటే మంచిది కాదని చెప్పిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు.
కేసీఆర్ది రాచరిక ఫ్యూడల్ మనస్తత్వం..
90 సీట్లు గెలిచి సంపూర్ణ మెజార్టీ వచ్చిన తర్వాత కూడా 3 నెలలు కేబినెట్ రూపొందించలేదని, సంపూర్ణ మెజార్టీ ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ది రాచరిక ఫ్యూడల్ మనస్తత్వమని విమర్శించారు. తానొక్కడినే పాలిస్తే బాగుంటుందని భావించే వ్యక్తి కేసీఆర్ అని, ఏనాడూ ప్రజాస్వామ్య వేదికలను ఆయన గౌరవించలేదని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ ఆహ్వానం..
ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటే ఆనాడు తామే విమర్శించామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా అదే పనిచేశారని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలో ఎంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారో మంత్రులు గుండెలపై చేయివేసుకుని చెప్పాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారందర్నీ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
ఈటల రాజేందర్ సవాల్..
తన మొత్తం ఆస్తులపై సీబీఐ, సిట్టింగ్ జడ్జీలత విచారణ చేపట్టాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్, తన ఆస్తులపై కలిపి విచారణ జరపాలన్నారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే సీఎం ముక్కు నేలకు రాస్తారా? అని ఈటల నిలదీశారు. హుజూరాబాద్లో 100 శాతం గెలుస్తామనే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video
అన్ని జిల్లాల నుంచి బీజేపీలో చేరికలు..
రానున్న కాలంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి బీజేపీలోకి చేరికలు కొనసాగుతాయన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీని మరింత విస్తరింపరింపజేసేలా నిరంతరం శ్రమిస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాగా, ఈటల బీజేపీలో చేరిన అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లి కలిశారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆర్టీసీ సంఘం నేత అశ్వద్ధామ రెడ్డి, తదితరులు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమయంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, నేతలు మురళీధర్ రావు, డీకే అరుణ, తదితరులు ఉన్నారు.