రాహుల్ నోట కుటుంబపాలనా, జైపాల్ పిచ్చిమాటలు, ఆంధ్రావాళ్లను భయపెట్టేందుకే: కేసీఆర్
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటనలో తమపై విమర్శలు గుప్పించారని కేసీఆర్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అని రాహుల్ చెప్పారని, కానీ తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వమే లేదన్నారు. తాము డబుల్ బెడ్రూంలు కట్టలేదని చెప్పారని, కానీ కడుతున్నామని చెప్పారు. రాహుల్ వస్తానంటే తీసుకెళ్లి చూపించడానికి సిద్ధమని, అప్పుడైనా జ్ఞానోదయం అవుతుందన్నారు.లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని చెప్పారని, కానీ అది అవాస్తవం అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువొద్దన్నారు.
Recommended Video
హైదరాబాద్కు రాహుల్: కాంగ్రెస్కు చుక్కలు! విమానాశ్రయంలోకి జైపాల్ రెడ్డికి నో
తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్న రాహుల్ వ్యాఖ్యలపై కేసీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే ఎలా అన్నారు. అయినా మీ కుటుంబ పాలన కంటే మా కుటుంబ పాలన బెట్టర్ అన్నారు. మేం తెలంగాణ కోసం పని చేశామని, అందుకే ఇక్కడ పాలిస్తున్నామని చెప్పారు. మీ కుటుంబ పాలన దేశానికి తెలుసు అన్నారు. రాహుల్ గాంధీ నోట అబద్దాలు మాట్లాడితే సరికాదన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షులు అయి ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి గౌరవం పోగొట్టుకోవద్దన్నారు. రాహుల్ పరిపక్వత లేకుండా మాట్లాడారన్నారు.
రాహుల్ గాంధీ వస్తే నేనెందుకు భయపడతా?
రాహుల్ గాంధీ వస్తే మేం భయపడుతున్నామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఆయన వస్తే మాకు ఎందుకు భయమని ప్రశ్నించారు. నేను రాహుల్ గాంధీకి భయపడతానా అన్నారు. ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని, తాము ఎన్నికలకు సిద్ధమని చెప్పారు. అసెంబ్లీ రద్దు నేనెందుకు చెబుతానని అన్నారు.
మోడీ మెచ్చుకున్నారు
ఏకకాలంలో రుణమాఫీ సాధ్యం కాదని చెప్పారు. అంచెలంచెలుగా చేస్తామని తెలిపారు. నిరుద్యోగ భృతి ఎలా ఇస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. బోగస్ పథకాలు మేం పెట్టమని చెప్పామన్నారు. బంగారు తల్లి పథకం అని కాంగ్రెస్ నేతలు పెట్టారని, అది ఎన్నికల కోసం పెట్టారన్నారు. కానీ తాము ఇప్పుడు పెళ్లవుతుంటే ఇప్పుడే ఇస్తున్నామన్నారు. కొన్ని పథకాలను ప్రధాని మోడీ కూడా మెచ్చుకున్నారని చెప్పారు.
ఆంధ్రావాళ్లను భయపెట్టే ప్రయత్నం
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తాము జేడీఎస్ అభ్యర్థికి మద్దతిచ్చామని చెప్పారు. తెలంగాణలో ఆంధ్రావాళ్లతో పాటు మలయాళి, రాజస్థానీ, గుజరాతీ, మార్వాడీ వారు ఉన్నారని చెప్పారు. తప్పకుండా ఆంధ్రా వేరు, తెలంగాణ వేరు అని, కానీ తెలంగాణలో అందరూ సంతోషంగా ఉంటారని చెప్పారు. వారు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు నిర్ణయిస్తారన్నారు. ఆంధ్ర ప్రజల్లో భయం కలిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆంధ్ర ప్రజలను మేం కడుపులో పెట్టుకున్నామని చెప్పారు. అనవసరంగా గందరగోళం సృష్టించారన్నారు. వాళ్లకున్న సంకుచిత భావాలు మాకు లేవన్నారు. ఆంధ్రా ప్రజల్లో భయం కలిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ గడ్డపై ఉన్న వారంతా తెలంగాణ బిడ్డలే అన్నారు.
సభలో కన్నుగీటి, కౌగిలింతలా?
బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఓ నాయకుడు పార్లమెంటులో కన్నుకొడతాడని, వెళ్లి మోడీని కౌగిలించుకుంటారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇదేమైనా జోకా అన్నారు. ఉద్యోగాల గురించి మాట్లాడితే.. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలన్నారు. కాంగ్రెస్ డెబ్బై ఏళ్ల పాటు మోసం చేసిందని ఇంకా సరిపోదా అన్నారు.
అసెంబ్లీ రద్దు మీకెలా చెప్తా, జైపాల్ పిచ్చిపిచ్చి మాటలు
అసెంబ్లీని రద్దు చేస్తే మీకెలా చెబుతానని కేసీఆర్ అన్నారు. ఆరు నెలలకు ముందు ఎన్నికలు వస్తే ముందస్తు అనలేమన్నారు. వయసు పైబడిన జైపాల్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా జైపాల్ విజ్ఞతతో మాట్లాడితే మంచిదన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడకు పోతే మాకేమిటన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం త్వరలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను కలుస్తానని చెప్పారు.