కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై రామ్ చరణ్ సతీమణి పోటీ? స్పందించిన ఉపాసన
హైదరాబాద్: ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కొణిదెల వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేయనుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి విజయం సాధించారు. ఇటీవలే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వచ్చే లోకసభ ఎన్నికల్లో కొండాపై ఉపాసన పోటీ?
ఈ నేపథ్యంలో వచ్చే లోకసభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ చేయనున్నారని భావిస్తున్నారు. అతనిపై ఉపాసన కొణిదెల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
రాజకీయ ఆరంగేట్రంపై స్పందించిన ఉపాసన
ఆమె రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారని, వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఉపాసన కొణిదెల స్పష్టత ఇచ్చారు. తన పైన జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారట.
క్షమించండి నిజం లేదు
ప్రస్తుతం తాను చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నానని, సంగీతా రెడ్డి తన బాస్ అని ఉపాసన కొణిదెల పేర్కొన్నట్లుగా కూడా చెబుతున్నారు. తన చిన్నాన్న అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్లలో మంచి పనులు చేస్తున్నారని తెలిపారు. 'క్షమించండి ఇందులో (తాను కొండాపై పోటీ చేస్తున్న వార్తలు) నిజం లేదు.. ప్రస్తుతం నేను ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను. సంగీతా రెడ్డి (విశ్వేశ్వర్ రెడ్డి భార్య) తన బాస్. చిన్నాన్న చేవెళ్లకు చేస్తున్న సేవ సాటిలేనిది' అని పేర్కొన్నారు.