రాజీనామా చేయలేదు, కుట్రదారుల్ని శిక్షించాలి: మేయర్ బొంతు రామ్మోహన్
హైదరాబాద్: తాను రాజీనామా చేశానని వస్తున్నట్లు వార్తల్లో నిజం లేదని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా గౌరవించిందని, ప్రధానికి ఘనంగా స్వాగతం పలికానని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మెట్రో ప్రారంభోత్సవం కార్యక్రమంలో తమకు తగిన ప్రాధాన్యత లభించలేదని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మంగళవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శిలాఫలకాలపై తమ పేర్లు కూడా వేయించలేదని వాపోయినట్లు వార్తలు వచ్చాయి.
రాజీనామా అంటూ..
అంతేగాక, ‘హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆ కారణంతోనే సర్కారు శిలాఫలకంలో స్థానం ఇవ్వలేదు. ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన మేయర్ రాజీనామాకు సిద్ధమయ్యారు' అని మంగళవారం ఉదయం నుంచీ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వంపై కక్షతోనే..
ఈ నేపథ్యంలోనే మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. వీటిపై సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై కక్షతో ఇలాంటి వార్తలు సృష్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
‘మెట్రో'లో మాకు ప్రాధాన్యతేది?: జీహెచ్ఎంసీ బాసుల ఆవేదన
అవమానమంటూ ప్రచారం..
వారం క్రితం కూడా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు మేయర్ను ఆహ్వానించలేదని, నగరానికి అది అవమానమంటూ ప్రచారం చేశారని అదనపు కమిషనర్(క్రైం) రఘువీర్కు రామ్మోహన్ వివరించారు.
ఇవాంకా పుణ్యమా అని.. ‘గోల్కొండ' ప్రజల బాధలు తీరాయి!: ఎలాగంటే..?
కుట్రదారుల్ని శిక్షించాలి
జీఈఎస్ అనేది ప్రైవేటు కార్యక్రమమని, అందులో ప్రొటోకాల్ ప్రసక్తే ఉండదని రామ్మోహన్ అన్నారు. అనవసరమైన వార్తల్ని సృష్టిస్తూ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనుకుంటున్న కుట్రదారుల్ని గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు.