కెసిఆర్ వ్యాఖ్యలు భేష్, కానీ మొదలు నువ్వే: రేవంత్, 'వరంగల్' గర్వం వద్దు: సీఎం
హైదరాబాద్: వ్యక్తిగత విమర్శలు వద్దని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం నాడు అన్నారు.
అయితే, వ్యక్తిగత విమర్శల విధానం ప్రారంభించిందే కెసిఆర్ అని ఎద్దేవా చేశారు. తాను ఎప్పుడు కూడా ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ల పైన వ్యక్తిగత విమర్శలు చేయలేదని తెలిపారు. విపక్షాలు, మీడియా పైన నెపం నెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాలని కెసిఆర్ భావించారని ఆరోపించారు.
వరంగల్ ఎన్నికల ఫలితాలతో ఇంకా ఎవరి పైకి నెపం నెట్టలేరన్నారు. బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేయడం, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అడగడం, చీప్ లిక్కర్ వద్దనడం తప్పా అని నిలదీశారు.
దేవీప్రసాద్ ఓడినప్పుడు కెసిఆర్ ఎందుకు బాధ్యత వహించలేదని నిలదీశారు. వరంగల్ ఉప ఎన్నికలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను విమర్శించడం సరికాదన్నారు.
మాయ మాటలు నమ్మలేదు: ఈటెల
ప్రతిపక్షాలు ఎన్ని మాయ మాటలు చెప్పినా వరంగల్ జిల్లా ప్రజలు నమ్మలేదని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం నాడు అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరితోను పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో ఎలా ఆదరించారో.. వచ్చే ఎన్నికల్లోను ప్రజలు తమను అలాగే ఆదరిస్తారని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల ఫలితమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికలలో వస్తుందన్నారు.
వాటర్ గ్రిడ్పై సీఎం కేసీఆర్ సమీక్ష
జలహారం (వాటర్ గ్రిడ్) పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి పలువురు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు, వాటర్ గ్రిడ్, గోదావరి జలాలలను నగరానికి తరలించే అంశంపై సమీక్ష జరుపుతున్నారు.
అహం వద్దు: కెసిఆర్
ఉద్యమానికి, పార్టీకి ఇబ్బందులు వచ్చినప్పుడు వరంగల్ జిల్లా ప్రజలు అండగా నిలిచారని కెసిఆర్ బుధవారం అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో గెలుపుతో కార్యకర్తల్లో, నాయకుల్లో అహంకారం పెరగవద్దన్నారు. ప్రజలతో సన్నిహితంగా ఉండాలన్నారు. వారితో మంచిగా మాట్లాడాలని సూచించారు.
తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ శ్రీరామ రక్ష కావాలన్నారు. ప్రజలు గౌరవమైన తీర్పు ఇచ్చారన్నారు. వరంగల్ విజయం కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ఈ విజయంతో మనకు గర్వం, అహం పెరగవద్దన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా నాయకులు పని చేయాలన్నారు.
ఉద్యమంలో అండగా నిలిచిన వరంగల్ ప్రజలు.. ఈసారి ప్రభుత్వాన్ని దీవించి ఆశీర్వదించారని, వరంగల్ జిల్లా ప్రజలకు పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు.
త్వరలో కార్యకర్తలకు, నాయకులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. సామాన్య కార్యకర్తలా వచ్చిన పసునూరి దయాకర్ ఇప్పుడు ఎంపీగా గెలిచారన్నారు. అందరికీ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. అవకాశం వచ్చే వరకు ఓపిక పట్టాలని కెసిఆర్ హితవు పలికారు.
వాటర్ గ్రిడ్ పథకం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కెసిఆర్ అన్నారు. నిర్మాణంలో నాణ్యత తగ్గవద్దన్నారు. జలహారం పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికలలో తాము ఓట్లు అడగమని కెసిఆర్ పునరుద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టులు అంటే ఆలస్యం అవుతాయనే పరిస్థితి ఉందన్నారు. దానిని తాము మార్చివేస్తున్నామన్నారు.