ఎవరీ ఎమ్మెల్యే..20 ఏళ్ల వయస్సులో: గన్ను పట్టినా, గన్మెన్ను వెంట పెట్టుకున్నా పేదల కోసమేనంటూ
హైదరాబాద్: ఈ ఫొటోలో కనిపిస్తోన్న యువతి ఇప్పుడు ఓ ప్రజా ప్రతినిధురాలు. తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. ఇదివరకు ఆమె మావోయిస్టుగా పనిచేశారు. ఆమె గతం అంతా నక్సలైట్గానే సాగింది. మావోయిస్టుగా అడవుల్లో తిరిగారు. గన్ను పట్టుకుని గిరిజనులు, ఆదివాసీలు, పేద ప్రజలకు అండగా నిలిచారు. ఆమెను అసలు పేరుతో పిలిస్తే.. బహుశా ఎవ్వరూ పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ.. మావోయిస్టు నాటి పేరుతో ఆమె కోట్లాదిమందికి చిరపరిచితురాలు.
Recommended Video
ఈ ఇంట్రో ఎవరి గురించో..
ఈ ఇంట్రడక్షన్ ఎవరి గురించి అనేది ఈ పాటికి అర్థమై ఉండొచ్చు. ఆమే సీతక్క. తెలంగాణలోని ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. సీతక్క అసలు పేరు అనసూయ. అసలు పేరు కంటే సీతక్క పేరుతోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరపరిచితురాలు అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ములుగు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అడవి బిడ్డల ఆకలిని తీర్చుతూ..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితుల్లో సీతక్క మరోసారి గిరిజనులు, ఆదివాసీల కోసం అండగా నిల్చున్నారు. అడవి బిడ్డల ఆకలిని తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. దట్టమైన అడవుల్లో నివాసం ఉంటోన్న గిరిజనుల కోసం నిత్యావసర సరుకులను చేరవేయడానికి కాలినడకన తిరుగుతున్నారు. కొండలను ఎక్కిదిగుతున్నారు. సామాన్యుల్లో సామాన్యురాలిగా గిరిజనుల ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.
20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటి పిక్..
ఆదివారం ఉదయం సీతక్క.. తన పాత ఫొటో ఒకదాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫొటోలో కనిపిస్తోన్నది ఆమే. సీతక్క 20 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటి పిక్ అది. ఖాకీ రంగు చొక్కా, రంగు ప్యాంటు, తలపై బూడిదరంగు టోపీ, చేతిలో తుపాకీ, పెదవులపై చిరునవ్వు.. ఇలా కనిపించారామె ఈ ఫొటోలో. తాను గన్ను పట్టుకున్నా.. గన్మెన్ను వెంటబెట్టుకున్నా అణగారిన వర్గ ప్రజల సంక్షేమం కోసమేననే కామెంట్స్ను దాని జత చేశారు. అట్టడుగు ప్రజలకు కూడు, గూడు దుస్తులను కల్పించడమే తన ప్రధాన్య లక్ష్యమని చెప్పారు.
లక్ష్యాన్ని అందుకోవడానికి..
ములుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గిరిజనులు, ఆదివాసీల సంఖ్య అధికం. అందుకే దీన్ని ఎస్టీ రిజర్వ్ అయింది. గిరిజనులు నివసించే గ్రామాలన్నీ మారుమూలల్లో ఉన్నాయి. అడవుల మధ్యలో ఉంటున్నాయి. ఆయా గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు మార్గం కాదు కదా.. కనీసం కాలినడక కూడా కనిపించదు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి మరీ.. వారి ఆకలిని తీర్చుతున్నారు సీతక్క. మావోయిస్టుగా అడవుల్లో తిరిగిన అనుభవం ఇప్పుడు తనకు ఉపయోగపడుతోందని సీతక్క చెబుతున్నారు. ఓ సామాన్యురాలిగా ఎడ్లబండిలో, ట్రాక్టర్లలో తిరుగుతున్నారు.