'చంద్రబాబు-కెసిఆర్ మధ్య నేనే సయోధ్య కుదిర్చా, సంతోషంగా ఉంది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుల మధ్య తాను మధ్యవర్తిగా వ్యవహరించానని, తద్వారా ఇరువరి మధ్య సయోధ్య కుదిర్చానని ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య చెప్పారు.
ప్రస్తుతం ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిరిందని, వారిద్దరు మధ్య శాంతిసామరస్యం వెల్లువిరుస్తుండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. తాను రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తానని, ప్రజల సమస్యలను స్థానిక నేతలకు తెలియజేస్తానని మత్తయ్య చెప్పారు.
కాగా, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కెసిఆర్కు చిక్కులు వస్తాయని అందరు భావించారు. అయితే, ఇరువురు సీఎంలు పట్టుదలకు పోకుండా రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని పలువురు సూచించారు.
ఇదిలా ఉండగా, ఇటీవల ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సిఎం కెసిఆర్ను ఆహ్వానించారు. కెసిఆర్ అమరావతికి వెళ్లారు. ఇరువురు సీఎంలు శాంతిసామరస్యంగా ఉండటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు కూడా.