తాను యూటర్న్ తీసుకోలేదని యూ టర్న్ మాటలు చెప్పిన కోమటి రెడ్డి..!!
హైదరాబాద్: అగ్గి రగుల్చుకుందీ ఆయనే.. నీళ్లు చల్లుకుంది ఆయనే.. తెలంగాణ రాజకీయాల్లో గత కొన్న రోజులుగా సంచలనం సృష్టిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం గురించి స్వయంగా వివరణ ఇచ్చారు. తన యూటర్న్ రాజకీయాల గురించి వస్తున్న వార్తల పట్ల ఆయన యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తాను ఏ పార్టీలోకి యూటర్న్ తీసుకోలేదని కాంగ్రెస్ సభ్యుడిగానే కొనసాగుతున్నట్టే తెల్చి చెప్పారు. ఐతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపి లో చేరే అంశంలో తెలంగాణ కమలం నేతల నుంచి పెద్దఎత్తున లాబీయింగ్ జరిగినట్టు తెలుస్తోంది.
కోమటిరెడ్డి చేరిక విషయంలో తెలంగాణ బీజేపి నేతలు ససేమిరా అనడంతోనే ఆయన పట్ల బీజేపి అదిష్టానం అంటీ ముట్టనట్టు వ్యవహరించిందనే చర్చ కూడా జరగుతోంది.కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్కు టాటా చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లరని, వెళితే రాజగోపాల్ రెడ్డి మాత్రమేనని, త్వరలోనే ఈ చేరిక ఉంటుందని కూడా వార్తలు గుప్పుమన్నాయి.
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ కోమటిరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఫైనల్గా ఈ చేరిక వ్యవహారంపై కోమటిరెడ్డి తేల్చేశారు. తనను బీజేపీ పిలవడం లేదని.. తాను కూడా కాషాయ కండువా కప్పుకోవట్లేదని క్లారిటీగా చెప్పేశారు. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో ఆయన మాట్లలోనే చూద్దాం. "నాయకత్వలోపం వల్లే ఎమ్మెల్యేలు పార్టీ మారారు.
నాలుగు గోడల మధ్య చాలా సార్లు చెప్పాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత పీసీసీ రాజీనామా చేస్తే బాగుండేది. బీజేపీ ప్రత్యామ్నాయం అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. పార్టీ బలంగా ఉన్నా నాయకత్వ లోపం వల్ల కార్యకర్తలు రోడ్డున పడ్డారు. నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు.. సమాధానం ఇచ్చాను. యూటర్న్ తీసుకోలేదు.. ప్రస్తుతం నేను కాంగ్రెస్ సభ్యుడిని" అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.