నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు, అసెంబ్లీలో కూడా కేసీఆర్, సీఏఏ దేశ సమస్య, 50 మంది చనిపోవడం ఏంటీ..?
విశ్వ మానవ సౌభ్రాతుత్వం, వసుదైక కుటుంబం కోసం సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీని తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తోందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా సోమవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. సీఏఏకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో సభలో కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. సీఏఏను లౌకిక, ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకిస్తుందని గుర్తుచేశారు.
పున:సమీక్ష..
సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పున:సమీక్షిస్తే బెటర్ అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఏఏ సరికాదని.. కేంద్రప్రభుత్వం సంకుచిత ధోరణితో ముందుకెళ్తున్నారని చెప్పారు. జాతి నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యభూమిక పోషిస్తుందని.. జీడీపీకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నది రాష్ట్రమేనని వివరించారు. దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఒకటి అని.. సామాజిక భద్రత మీదే భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. అందుకోసమే సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టామని తెలిపారు.
క్షణాల్లో సమాచారం..
ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని.. చిన్న మేసెజ్ పెడితే అందిరికీ చేరుతోందన్నారు. ఫేస్బుక్లో పోస్ట్, ట్వీట్ చేస్తే కోట్లాదిమందికి క్షణాల్లో చేరిపోతుందని వివరించారు. విదేశీ ప్రతినిధులు దేశంలో పర్యటించే సమయంలో సంయమనంగా ఉంటారు.. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించిన సమయంలో కూడా ఢిల్లీలో అల్లర్లు చెలరేగడం బాధ కలిగించిందని చెప్పారు. 50 మంది చనిపోవడం దేనికి సంకేతమని.. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జరిగిన అల్లర్లు ఆందోళనకు గురిచేసిందని వివరించారు. కొందరు గోలి మారో సలేంకో అనడం సరికాదన్నారు.
దేశ సమస్య..
సీఏఏను కొందరు ముస్లిం సమస్య అని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ వాస్తవానికి హిందువులు, ముస్లింల సమస్య కాదు అని.. దేశ సమస్య అని కేసీఆర్ వివరించారు. అంతేందుకు తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని వివరించారు. చింతమడక ఊళ్లో ఇంట్లో తాను జన్మించానని గుర్తుచేశారు. ఇదివరకు కూడా కేసీఆర్ బర్త్ సర్టిఫికేట్ గురించి డిస్కస్ చేయగా.. తాజాగా అసెంబ్లీలో మరోసారి చర్చించారు. అప్పుడు పంతులుని పిలిపిస్తే జన్మపత్రిక రాశారని.. దాని ఆధారంగా పుట్టినతేదీ తెలిసిందన్నారు. తనకే కాదు కోట్లాది మంది పరిస్థితి ఇదేనని తెలిపారు.
కూలీలు పరిస్థితి ఏంటీ..?
తన పరిస్థితి ఇలా ఉంటే కూలీలు, దళితులు, గిరిజనులు, బీసీలు, ఎంబీసీలు, ఓసీలలో కటిక దరిద్రం అనుభవించే వారి పరిస్థితి ఏంటీ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇది ఒక్కరో ఇద్దరి సమస్య కాదు అని.. 130 కోట్ల మందికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఇలా ఉంటే కేసీఆర్ మిమ్మల్ని ఎవరూ బర్త్ సర్టిఫికెట్ అడిగారు అంటున్నారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికయ్యేందుకు బ్రహ్మాస్ర్తం ఓటుతో అసెంబ్లీ, పార్లమెంట్కు సభ్యులను పంపిస్తున్నారు. మరి పౌరసత్వంలో ఓటర్ ఐడీ వాలిడ్ కాదు అని అంటున్నారు. అదెలా సాధ్యం అని ప్రశ్నించారు.
Recommended Video
8వ రాష్ట్రం..
కవులు, కళాకారులు అవార్డులు వెనక్కి తీసుకుంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. 180 దేశాల్లో భారతదేశ బిడ్డలు ఉన్నారని.. 50 దేశాల్లో టీఆర్ఎస్ పార్టీ శాఖలు ఉన్నాయని కేసీఆర్ గుర్తుచేశారు. కేంద్రప్రభుత్వం చేస్తోన్న విభజన రాజకీయాలు సరికాదన్నారు. పౌరసత్వం ఉండాలి కానీ, చొరబాటు దారులను కూడా అనుమతించం.. కానీ సీఏఏ పేరుతో కొన్నివర్గాలను టార్గెట్ చేయడం సరికాదన్నారు. మయన్మార్ వద్ద గోడ కడితే మేం కూడా సపోర్ట్ చేస్తామన్నారు. మనం స్వేచ్చగా ఉంటుందనడానికి ఆర్మీ త్యాగం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే కేరళ, పంజాబ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్.. ఏడు రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని వివరించారు.